దేశీయ మార్కెట్లో ఓమెగా సీకీ మొబిలిటీ కొత్త స్కూటర్ను తీసుకొచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ఇప్పటివరకు ప్రధానంగా కమర్షియల్ వాహనాలకే పరిమితమైన ఓమెగా సీకీ మొబిలిటీ ఇప్పుడు సాధారణ వినియోగదారుల వైపు అడుగు వేసింది. తొలి అడుగులో భాగంగా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఓఎస్ఎం వెస్ట్రాను తీసుకొచ్చింది. ఇది కంపెనీ నుంచి వచ్చిన తొలి హైస్పీడ్ ఎలక్ట్రిక్ టూ వీలర్. దీని ధర రూ.99,900గా కంపెనీ నిర్ణయించింది. తక్కువ ఖర్చుతో మంచి పర్ఫామెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను తీసుకొచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. వెస్ట్రా డిజైన్ సాధారణంగా కనిపించినా, ఇందులో ఉన్న ఫీచర్లు మాత్రం నేటి అవసరాలకు తగ్గట్టుగా ఉన్నాయి. స్కూటర్లో 3.5 అంగుళాల కలర్ ఎల్సీడీ స్క్రీన్ ఉంది. ఇందులో బ్యాటరీ ఎంత మిగిలి ఉంది, ఇంకా ఎంత దూరం వెళ్లొచ్చు, ప్రస్తుతం వేగం ఎంత అనే వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. రోజూ ఆఫీస్కు వెళ్లేవారికి లేదా చిన్న చిన్న ప్రయాణాలు చేసే వారికి అద్భుతంగా ఉంటుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే 110 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. నగరంలో రోజూ తిరిగే వారికి ఇది సరిపడే రేంజ్. ట్రాఫిక్లో సులువుగా నడపడానికి అనువుగా దీనిని రూపొందించారు. కొండలు లేదా ఎత్తైన రోడ్లపై కూడా ఈ స్కూటర్ బాగానే పనిచేస్తుంది. సుమారు 12 డిగ్రీల వరకు ఉన్న ఎత్తైన దారులను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కగలదు. చార్జింగ్ విషయంలో పెద్దగా టెన్షన్ అవసరం లేదు. ఇంట్లో ఉండే సాధారణ చార్జర్తోనే దీనిని చార్జ్ చేయొచ్చు. 0 నుంచి 80 శాతం వరకు చార్జ్ కావడానికి నాలుగు గంటలు పడుతుంది. పూర్తిగా చార్జ్ కావాలంటే దాదాపు ఐదు గంటలు సరిపోతాయి. రాత్రి చార్జ్ పెట్టి ఉదయం వాడుకునే వారికి ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది.
0 Comments