చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు ఎమ్.వి. సౌందర రాజన్ ఈరోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చిలుకూరులోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. చిలుకూరు బాలాజీ ఆలయం భక్తులు, పండితులు, ప్రజాప్రతినిధులు సౌందర రాజన్ సేవలను స్మరించుకుంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చిలుకూరు బాలాజీ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన సౌందర రాజన్ మరణం ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని లోటని తెలిపారు. విద్యావేత్తగా, అర్చకుడిగా, ఆధ్యాత్మిక నాయకుడిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవని చెప్పారు. ఆయన చూపిన మార్గం తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. సౌందర రాజన్ చిలుకూరు బాలాజీ ఆలయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆయన తన జీవితాన్ని పూర్తిగా ఆధ్యాత్మిక సేవలకు అంకితం చేశారని అన్నారు. చిలుకూరు బాలాజీ ఆలయం నేడు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందడానికి ఆయన విశేష కృషి చేశారని చెప్పుకొచ్చారు. భక్తుల్లో విశ్వాసం పెంపొందించడంలో, ఆలయ సేవలను పారదర్శకంగా నిర్వహించారని తెలిపారు.
0 Comments