హైదరాబాద్ లోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రైవేట్ ఉద్యోగిని బొలెరో కారుతో ఢీకొట్టి, కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లి, కొందరు యువకులు అతని ప్రాణాలను గాలిలో కలిపే ప్రయత్నం చేశారు. బాధిత కుటుంబ సభ్యులు , స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సతీష్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. విధి నిర్వహణ ముగించుకుని రాత్రి సమయంలో తన కారులో ఇంటికి వెళ్తున్నాడు. ఇదే క్రమంలో ఒక బొలెరో కారులో ఉన్న కొందరు యువకులు కారుకు సైరన్ వేసుకుంటూ, అతివేగంతో రోడ్డుపై హంగామా సృష్టించారు. సతీష్ కారును బొలెరోతో బలంగా ఢీకొట్టిన ఆ యువకులు, కనీసం ఆపకుండా వేగంగా వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. దీంతో సతీష్ వారిని వెంబడించి కొంత దూరం వెళ్ళాక ఆపగలిగాడు. కారు దిగి దుండగుల బొలెరోకు ఎదురుగా నిల్చుని, ఎందుకు ఢీకొట్టారని ప్రశ్నించే ప్రయత్నం చేశాడు. అయితే, ఏమాత్రం కనికరం లేని ఆ యువకులు కారును సతీష్ వైపు వేగంగా పోనిచ్చారు. కారు వేగంగా రావడంతో సతీష్ కిందపడిపోయి, ప్రాణ రక్షణ కోసం బొలెరో ముందున్న బంపర్ను గట్టిగా పట్టుకున్నాడు. కారు కింద మనిషి ఉన్నాడని తెలిసినా, ఆ పోకిరీలు కనికరించలేదు. సుమారు 700 మీటర్ల నుండి ఒక కిలోమీటరు వరకు అలాగే ఈడ్చుకెళ్లారు. ఆ భయంకరమైన రాపిడికి సతీష్ వీపు భాగం అంతా రోడ్డుకు గీసుకుపోయి తీవ్రంగా దెబ్బతింది. నొప్పి భరించలేక సతీష్ బంపర్ వదిలేయగా, ఆ కారు అతనిపై నుంచే దూసుకెళ్లిపోయింది. కారు కింద పడి ఈడ్చుకెళ్లడం వల్ల సతీష్ ప్రైవేట్ పార్ట్స్ పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. కాలు విరగడంతో పాటు వీపు భాగం మొత్తం చెక్కుకుపోయింది. ప్రస్తుతం సతీష్ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ ఘటన జరిగి ఇంత దారుణం జరిగినా పోలీసులు నిందితుల వివరాలను వెల్లడించకపోవడంపై సతీష్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
0 Comments