Ad Code

బంకులో సిగరెట్ తాగవద్దు అన్నందుకు ఫ్యూయల్ నాజిల్ పైపుకు నిప్పు పెట్టిన దుండగుడు


త్తీస్‌గఢ్‌లోని ఊర్లా ప్రాంతంలో గురువారం సాయంత్రం జరిగిన సీన్ చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ధర్మేంద్ర క్షత్రియ, ఇమ్రాన్ అనే ఇద్దరు వ్యక్తులు తమ బైక్‌లో పెట్రోల్ పోయించుకోవడానికి బంకుకు వచ్చారు. బైక్ ట్యాంక్ మూత తెరవగానే, ధర్మేంద్ర సిగరెట్ వెలిగించేందుకు ప్రయత్నించాడు. అక్కడ ప్రమాదం జరుగుతుందని గమనించిన బంకు సిబ్బంది వెంటనే అతడిని వారించారు. "ఇక్కడ సిగరెట్ కాల్చవద్దు, ప్రమాదం" అని చెప్పడమే ఆ సిబ్బంది చేసిన పాపం. ఆ మాట వినగానే ధర్మేంద్రకు ఎక్కడలేని కోపం వచ్చింది. ఆగ్రహంతో ఊగిపోతూ తన చేతిలో ఉన్న లైటర్‌తో నేరుగా పెట్రోల్ వస్తున్న 'ఫ్యూయల్ నాజిల్' పైపుకే నిప్పు అంటించాడు. పెట్రోల్ నాజిల్ కాబట్టి నిప్పు తగలగానే మంటలు ఒక్కసారిగా విరజిమ్మాయి. ఆ మంటలు వేగంగా బైక్ ట్యాంక్‌కు, పంపు మిషన్‌కు వ్యాపించాయి. అక్కడున్న వారంతా ప్రాణ భయంతో పరుగులు తీశారు. నిందితుల మీద కూడా మండే పెట్రోల్ పడటంతో వారు కూడా షాక్‌కు గురయ్యారు. పెద్ద పేలుడు సంభవించి అందరూ చనిపోతారనుకున్న తరుణంలో, ఒక పంపు అటెండర్ ప్రాణాలకు తెగించి సాహసం చేశాడు. వెంటనే ఫ్యూయల్ పైపును పక్కకు లాగేసి, మెయిన్ సప్లైని నిలిపివేశాడు. మిగిలిన సిబ్బంది అగ్నిమాపక పరికరాలతో క్షణాల్లో మంటలను ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే ఆ మంటలు భూగర్భంలోని ట్యాంకులకు వ్యాపించి ఊర్లా ప్రాంతం అతలాకుతలమయ్యేది. ప్రమాదాన్ని సృష్టించి పారిపోవాలని చూసిన నిందితులిద్దరినీ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ధర్మేంద్ర, ఇమ్రాన్‌లను అరెస్ట్ చేశారు. ప్రజల భద్రతకు ముప్పు కలిగించడం, అగ్నిప్రమాదానికి కారకులవ్వడం వంటి సెక్షన్ల కింద వీరిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఇన్‌స్పెక్టర్ రోహిత్ మహేల్కర్ తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu