జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరించే విషయంలో త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తెలిపారు. శ్రీనగర్లోని షేర్-ఇ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో మంగళవారంనాడు మీడియాతో మంత్రి మాట్లాడుతూ, ఇది చాలా సున్నితమైన అంశమని, అయితే ఈ ప్రక్రియకు కేంద్ర కట్టుబడి ఉందని చెప్పారు. జమ్మూకశ్మీర్కు రాష్ట్రహోదా పునరుద్ధరణపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని హోం మంత్రి అమిత్షా ఇప్పటికే లోక్సభలో హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. న్యాయమంత్రిత్వ శాఖ ఆధ్వర్వంలో పనిచేసే టెలి-లా దిశ పథకానికి సంబంధించిన వర్క్షాపులో మేఘవాల్ మంగళవారంనాడు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదాను త్వరలోనే పునరుద్ధరిస్తామంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఒమర్ స్పందిస్తూ, ఈ దిశగా కేంద్రంతో తమ ప్రభుత్వం నిరంతర చర్చలు జరుపుతోందన్నారు. అయితే ఈ ప్రక్రియకు తాము ఆశించిన దాని కంటే ఎక్కువ సమయం తీసుకుంటోందని అన్నారు. ఇందుకు సంబంధించిన శభవార్త వినేందుకు జమ్మూకశ్మీర్ ప్రజలు ఏడాదిన్నరగా వేచిచూస్తున్నారని చెప్పారు. దీనిని కార్యరూపంలోకి తెస్తూ కేంద్రం సాధ్యమైనంత త్వరగా తుది నిర్ణయం ప్రకటిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
0 Comments