'పరీక్షా పే చర్చ' వేదికగా విద్యార్థులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, మహనీయుల జీవిత చరిత్రలను చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఇతరుల విజయగాథలు మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని వారు ఎలా విజయం సాధించారో తెలుసుకోవడం వల్ల, మన ఆలోచనా విధానంలో సానుకూల మార్పులు వస్తాయని ఆయన వివరించారు. ఈ అలవాటు విద్యార్థులను మానసికంగా దృఢంగా మారుస్తుందని ప్రధాని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి తమ జీవితంలో పెద్ద కలలు కనాలని, వాటిని సాకారం చేసుకోవడానికి అంకితభావంతో పనిచేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. అసలు కలలు కనకపోవడమే ఒక నేరమని, లక్ష్యం లేని జీవితం గమ్యం లేని ప్రయాణం వంటిదని ఆయన వ్యాఖ్యానించారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి బాధ్యతాయుతంగా శ్రమించాలని, అప్పుడే సమాజంలో గుర్తింపు లభిస్తుందని గుర్తుచేశారు. ఉన్నతమైన ఆశయాలు మనిషిని నిరంతరం ముందుకు నడిపిస్తాయని ఆయన విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. నేటి తరం విద్యార్థులకు అందుబాటులో ఉన్న సాంకేతికత ఒక గొప్ప వరమని, దీన్ని అత్యంత తెలివిగా ఉపయోగించుకోవాలని ప్రధాని సూచించారు. గత తరాలకు లేని ఎన్నో అద్భుతమైన అవకాశాలు నేడు టెక్నాలజీ రంగంలో అందుబాటులో ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. ఈ వనరులను కేవలం కాలక్షేపం కోసం కాకుండా, జ్ఞాన సపార్జన కోసం మరియు కొత్త ఆవిష్కరణల కోసం వాడుకోవాలని కోరారు. టెక్నాలజీని సరైన మార్గంలో ఉపయోగిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పరీక్షల ఒత్తిడిని అధిగమించి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడమే విద్యార్థుల ప్రాథమిక బాధ్యత అని మోదీ వివరించారు. చదువుతో పాటు సమాజం పట్ల అవగాహన పెంచుకోవడం, నిరంతరం నేర్చుకోవాలనే తపన ఉండటం విజయానికి కీలకమని చెప్పారు. రేపటి తరాన్ని నిర్మించే శక్తి నేటి యువత చేతుల్లోనే ఉందని, అందుకే క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవాలని హితవు పలికారు. ప్రధాని చేసిన ఈ ప్రసంగం విద్యార్థులలో నూతన ఉత్తేజాన్ని నింపడమే కాకుండా, వారి భవిష్యత్తు ప్రణాళికలకు ఒక దిక్సూచిగా నిలిచింది.
0 Comments