ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ కట్టడాలకు చైనా పెట్టింది పేరు. అద్భుత నిర్మాణాలతో ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. ఇప్పుడు తాజాగా మరో ఇంజినీరింగ్ అద్భుతాన్ని చైనా ఆవిష్కరించింది. చైనాలోని గుయిజౌ ప్రావిన్స్లో నిర్మించిన హువాజియాంగ్ కాన్యన్ వంతెన పర్యాటకులను అబ్బురపరుస్తోంది. నదికి 625 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదిగా పేరుగాంచింది. మరోవిశేషం ఏంటంటే వంతెనపై నిర్మించిన కృత్రిమ జలపాతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇది సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సూర్యకాంతి పడినప్పుడు ఇక్కడ ఏర్పడే ఇంద్రధనస్సు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2022లో ప్రారంభమైన హువాజియాంగ్ గ్రాండ్ కాన్యన్ వంతెన నిర్మాణం పనులు మూడేండ్లలో పూర్తయ్యాయి. గతేడాది సెప్టెంబర్ 28న ఇది అందుబాటులోకి వచ్చింది. నైరుతి చైనాలోని గుయిజౌ ప్రావిన్స్లో ఉన్న ఈ వంతెన నిర్మాణానికి రెండు బిలియన్ యువాన్ల ఖర్చైంది. ఈ వంతెన నిర్మాణానికి దాదాపు 22 వేల మెట్రిక్ టన్నుల ఉక్కును వినియోగించారు. రెండు మైళ్ల పొడవైన ఈ వంతెన మూడు ఈఫిల్ టవర్లకు సమానం. గతంలో హువాజియాంగ్ లోయ చుట్టూ తిరిగి వచ్చేందుకు రెండు గంటల సమయం పట్టేది. కానీ, ఈ వంతెన అందుబాటులోకి వచ్చాక కేవలం రెండు నిమిషాలకు తగ్గడం విశేషం. చైనా ఇంజినీరింగ్ సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు గుయిజౌను ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా మార్చే ఉద్దేశంతో దీన్ని నిర్మించారు.
0 Comments