రాజస్థాన్ పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి జబ్బర్ సింగ్ ఖర్రా వివాదంలో చిక్కుకున్నారు. శాసనసభ జరుగుతున్న వేళ హౌజ్లో ఆయన ఉమ్మివేయడం కెమెరా కంటికి చిక్కింది. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇస్తుండగా జరిగిన ఈ ఘటన, సభలో ప్రజాప్రతినిధుల ప్రవర్తన, నైతికతపై తీవ్ర చర్చకు దారితీసింది. మంత్రి మాట్లాడుతుండగా ఆయన నోట్లోకి ఏదో ప్రవేశించినట్లు వీడియోలో కనిపించింది. దీంతో ప్రసంగం మధ్యలో ఆపి అక్కడే ఉమ్మివేశారు. ఆయన ఉమ్మి వేసే దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ సంఘటన పెద్ద రాజకీయ దుమారాన్ని రేపగా, ప్రతిపక్ష సభ్యులు దీనిని అసెంబ్లీ గౌరవానికి భంగమని అభివర్ణించారు. మంత్రిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభ నిబంధనల ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ అంశంపై చట్టసభ ఉన్నతాధికారులు సమగ్రంగా సమీక్ష నిర్వహించి, తదుపరిగా తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
0 Comments