తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతూ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. టీవీకే చీఫ్ విజయ్ ఉత్తర చెన్నైలోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ ఎన్నికల ప్రచార నిర్వహణ కార్యదర్శి ఆధవ్ అర్జున ఆదివారంనాడు తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా నలుమూలలా పర్యటించి ప్రజలకు చేరువయ్యేందుకు విజయ్ సన్నాహకాలు చేసుకుంటున్నట్టు చెప్పారు. నార్త్ చెన్నై వెనుకబాటుకు డీఎంకేనే కారణమని విజయ్ తరచు ఆరోపిస్తున్నారు. టీవీకే చీఫ్ విజయ్ను పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిందిగా కోరుతూ చెన్నైలో ఆదివారంనాడు జరిగిన టీవీకే కార్యకర్తల సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఈ తీర్మానాన్ని ఆధవ్ అర్జున ప్రవేశపెట్టారు. ఆయన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని, కార్యకర్తల అభీష్టాన్ని దళపతి విజయ్ దృష్టికి తీసుకువెళ్తామని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్.ఆనంద్ తెలిపారు. 234 అసెంబ్లీ నియోజకవర్గాలున్న తమిళనాడు అసెంబ్లీకి మే 10వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్ కూటమి 151 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది.
0 Comments