Ad Code

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసు : ఏక సభ్య కమీషన్ ను వేయాలని నిర్ణయం


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంట్లో కూటమి నేతలు సమావేశమై తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసులో ఏక సభ్య కమీషన్ ను వేయాలని నిర్ణయం తీసుకున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ  ఇప్పటికే ఛార్జ్‌షీట్ దాఖలు చేసిందని, నిందితులపై చర్యలు తీసుకోవాలని స్పష్టమైన నివేదిక ఇచ్చిందని చంద్రబాబు స్పష్టం చేశారు. దేవుడితో పెట్టుకుంటే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, వైసీపీ నేతలు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎదురు దాడి చేస్తున్నారే తప్ప చేసిన పాపానికి కనీసం క్షమాపణలు కూడా చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అన్యమతస్థుడు కావొచ్చు కానీ శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇచ్చే సంప్రదాయాన్ని పాటించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. లడ్డూ ప్రసాదంలో రసాయనాలు కలిపినట్లు సీబీఐ చార్జ్‌షీట్‌లో స్పష్టంగా ఉందని, ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడం అనేది కేవలం పరిపాలనాపరమైన లోపం కాదని, ఇది హిందూ ధర్మంపై జరిగిన దాడిగా పవన్ కల్యాణ్ అభివర్ణించారు. గత ప్రభుత్వ హయాంలో సనాతన ధర్మం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఫలితంగానే ఇలాంటి అపచారాలు జరిగాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టకూడదని, ఈ విచారణ కమిషన్ ద్వారా దోషులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మతాచారాల పట్ల గౌరవం లేని వ్యక్తులు వ్యవస్థల్లో ఉండటం వల్లే తిరుమల వంటి పవిత్ర క్షేత్రాల్లో అపవిత్ర కార్యాలు జరుగుతున్నాయని పవన్ విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి డిక్లరేషన్ విషయంలో ఎందుకు మొండిగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని, చట్టాలను, సంప్రదాయాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిదేనని స్పష్టం చేశారు. క్లీన్ చిట్ వచ్చిందన్న వైసీపీ నేతల ప్రచారంతో అసలు నిందితులపై కఠినంగా చర్యలు తీసుకోవాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. అడ్డగోలుగా తప్పులు చేసి తప్పించుకునేందుకు ఎదురుదాడి చేస్తున్న వారిని వదిలి పెట్టకూడదని నిర్ణయించారు.

Post a Comment

0 Comments

Close Menu