మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు, ఒక పోలీసు కమాండో మృతి చెందారు. నిన్న ఉదయం నుంచి భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య జరుగుతున్న ఎదురుకాల్పుల్లో ఒక కమాండో కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో పోలీస్ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భమ్రాగడ్ తాలూకాలో గురువారం నుంచి ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఇందులో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి ఒక ఏకే-47 రైఫిల్తోపాటు పలు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో సీ-60 కమాండో దీపక్ చిన్న మాధవి (38) తీవ్రంగా గాయపడటంతో అతడిని హెలికాప్టర్లో భమ్రాగడ్లోని ఆస్పత్రికి తరలించగా అక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో అధికారి కూడా గాయపడగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
0 Comments