Ad Code

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో రూ. 590 కోట్ల కుంభకోణం


ప్రముఖ ప్రైవేట్ రంగ సంస్థ ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ చండీగఢ్ బ్రాంచ్‌లో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు రూ.590 కోట్ల విలువైన నిధుల గోల్‌మాల్ జరిగినట్లు బ్యాంక్ గుర్తించింది. వెంటనే ఈ ఘటనతో సంబంధం ఉన్న నలుగురు అధికారులను గుర్తించి బ్యాంక్ సస్పెండ్ చేసింది. హర్యానా ప్రభుత్వానికి చెందిన ఒక విభాగం, తమ ఖాతాలను మూసివేసి ఆ నిధులను వేరే బ్యాంకుకు బదిలీ చేయాలని కోరినప్పుడు ఈ వ్యవహారం బయటపడింది. బ్యాంక్ రికార్డుల్లో ఉన్న నగదుకు, వాస్తవంగా ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌కు మధ్య భారీ తేడాలు ఉండటాన్ని అధికారులు గమనించారు. ఫిబ్రవరి 18, 2026 నుంచి హర్యానా ప్రభుత్వ సంస్థల ఖాతాలను పరిశీలించగా ఈ మోసం బయటపడింది. ఈ ఘటనపై బ్యాంక్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిందని అధికారులు తెలిపారు. అలాగే బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు కూడా బ్యాంక్ సిద్ధమవుతోంది. దీంతో పాటు బ్యాంక్‌లో అక్రమాలు ఎలా జరిగాయో తెలుసుకోడానికి లోతుగా దర్యాప్తు చేయడానికి ఒక స్వతంత్ర సంస్థతో 'ఫోరెన్సిక్ ఆడిట్'ను కూడా చేయిస్తోంది. ఈ మోసం కేవలం చండీగఢ్ బ్రాంచ్‌లోని కొన్ని ప్రభుత్వ ఖాతాలకు మాత్రమే పరిమితమని, సాధారణ కస్టమర్ల సొమ్ముకు ఎలాంటి ముప్పు లేదని బ్యాంక్ అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతానికి రూ.590 కోట్లు గోల్‌మాల్ జరిగినట్లు తెలుస్తుంది. అయితే, పూర్తిస్థాయి విచారణ జరిగిన తర్వాతే బ్యాంకుపై ఎంత ఆర్థిక ప్రభావం పడుతుందనేది స్పష్టమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. పోయిన నిధులను చట్టపరంగా తిరిగి రికవరీ చేయడానికి ప్రయత్నిస్తున్నామని బ్యాంక్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu