Ad Code

త్రిశూలి నదిలోకి అదుపుతప్పి దూసుకెళ్లిన బస్సు : 18 మంది మృతి, 28 మందికి తీవ్ర గాయాలు


నేపాల్ లోని ధాడింగ్ జిల్లాలో బస్సు అదుపుతప్పి త్రిశూలి నదిలోకి దూసుకెళ్లింది. ఈ విషాద ఘటనలో కనీసం 18 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతను బట్టి  మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోఖారా నుంచి రాజధాని ఖాట్మాండుకు వెళ్తున్న ఈ ప్రయాణీకుల బస్సు సోమవారం తెల్లవారుజామున 1.15 నుంచి 1.30 గంటల మధ్య ప్రమాదానికి గురైంది. పృథ్వీ హైవేపై ఖాట్మాండుకు 90 కిలో మీటర్ల దూరంలో ఉన్న బెనిఘాట్ రోరాంగ్ రూరల్ మునిసిపాలిటీ పరిధిలోని చీనాధార వద్ద బస్సు అదుపుతప్పి నదిలోకి పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మందికి పైగా ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. చీకటి సమయంలో ప్రమాదం జరగడంతో సహాయక చర్యలు చేపట్టడం భద్రతా దళాలకు కష్టతరంగా మారింది. నేపాల్ ఆర్మీ, ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్, నేపాల్ పోలీసులు,స్థానిక ప్రజలు కలిసి వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఇప్పటి వరకు 18 మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో న్యూజిలాండ్‌కు చెందిన ఒక పురుషుడు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 28 మందిని నదిలో నుంచి ప్రాణాలతో బయటకు తీశారు. వీరిలో జపాన్, డచ్ దేశాలకు చెందిన ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు.


Post a Comment

0 Comments

Close Menu