Ad Code

శబరిమల ఆలయంలో బంగారం తాపడాల కేసు : ప్రధాన పూజారి అరెస్ట్‌


కేరళలోని శబరిమల ఆలయంలో బంగారం తాపడాల కేసులో ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరును సిట్ అధికారులు అరెస్టు చేశారు. బంగారు తాపడాల చోరీ కేసులో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో తేలడంతో అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా సిట్‌ అధికారులు మాట్లాడుతూ శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో సిట్‌ అధికారుల బృందం ఆయన్ను అదుపులోకి తీసుకుందని వివరించారు. విచారణ అనంతరం శబరిమల ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరును అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్‌ పొట్టితో రాజీవరుకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు విచారణలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నిజానికి శబరిమలకు ఉన్ని కృష్ణన్ పొట్టిని తీసుకువచ్చింది కూడా తంత్రి కందరారు రాజీవరేనని ఇతర నిందితులు తమ వాంగ్మూలంలో తెలిపినట్లు అధికారులు పేర్కొన్నారు. బంగారు తాపడాల చోరీ గురించి ఆయనకు ఫస్ట్ నుంచే సమాచారం ఉందని తెలిపారు. ఈ చోరీపై ఈడీ కేసు ఫైల్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. 2019లో కేరళలోని శబరిమల ఆలయం గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను మరమ్మతుల నిమిత్తం తొలగించారు. ఉన్ని కృష్ణన్‌ అనే దాత వాటిని సరిచేయించి కొత్త బంగారు పూత తాపడాలను అందిస్తానని తీసుకెళ్లారు. ఆ టైంలో ఈ పనిని పూర్తి చేయడానికి చెన్నైలోని ఓ కంపెనీకి ఇచ్చారు. ఆ రాగ తాపడాలను తొలగించే టైంలో రికార్డుల్లో వాటి బరువును 42.100 కిలోలుగా పేర్కొన్నారు. అయితే ఎలక్ట్రోప్లేటింగ్‌ ప్రక్రియ పూర్తైన తర్వాత వాటిపై ఉండే బంగారంలో కొంత కనిపించకుండా పోయిందని ఆ కంపెనీ వెల్లడించింది. ఇందులో ఏదో తిరకాసు జరిగినట్లు అధికారులు గుర్తించి, విచారణ చేపట్టారు. ఈ కేసు విచారణలో ఉన్ని కృష్ణన్‌ సహా పలువురు ప్రధాన అధికారులు నిందితులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Post a Comment

0 Comments

Close Menu