Ad Code

ఫుడ్ డెలివరీ బాయ్స్‌ను కారుతో ఢీకొట్టిన వైద్యుడు : మృత్యువుతో పోరాడుతున్న డెలివరీ బాయ్


గురుగ్రామ్‌లో ఒక ప్రభుత్వ వైద్యుడు ఆదివారం రాత్రి సెక్టార్-93లోని హయాత్‌పూర్ ప్రాంతంలో స్కోర్పియో కారులో వచ్చి రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఫుడ్ డెలివరీ బాయ్స్‌ను ఢీకొట్టాడు. వారు దీనిని నిలదీయడంతో, కక్షతో మళ్లీ వారిపై నుండి కారును పోనిచ్చాడు. ఈ ఘటనలో ఒక డెలివరీ బాయ్ పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించిన సిసిటివి ఫుటేజీ ప్రస్తుతం వైరల్ అవుతోంది. గురుగ్రామ్ పోలీసులు సెక్టార్-10 పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదు చేసి, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వైద్యుడు నవీన్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. ప్రత్యక్ష సాక్షి విక్రమ్ తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో ఐదుగురు రైడర్స్ ఆర్డర్ కోసం వేచి చూస్తూ బైకులతో రోడ్డు పక్కన నిలబడ్డారు. అదే సమయంలో వేగంగా వచ్చిన నల్లటి స్కోర్పియో కారు ఒక రైడర్‌ను ఢీకొట్టింది. డెలివరీ బాయ్స్ దీనిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా, డాక్టర్ కారు ఆపకుండా వెనక్కి తీసుకుని కింద పడి ఉన్న టింకూ పన్వార్ అనే యువకుడిపై నుండి ఉద్దేశపూర్వకంగా కారును పోనిచ్చాడు. మిగిలిన వారు పక్కకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. నిందితుడు దౌలతాబాద్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయుర్వేద వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన టింకూ పన్వార్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతని తల, ఛాతీ మరియు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఐసీయూలో మృత్యువుతో పోరాడుతున్నాడు. పోలీసు విచారణలో నిందితుడు నవీన్ యాదవ్ షాకింగ్ విషయాలు చెప్పాడు. డెలివరీ బాయ్స్ తమ బైకులను దారికి అడ్డంగా పార్క్ చేస్తున్నారని, దీనివల్ల తన కారు వెళ్లడానికి ఇబ్బందిగా ఉంటోందని, అందుకే కోపంతో ఈ పని చేశానని ఒప్పుకున్నాడు.

Post a Comment

0 Comments

Close Menu