మధ్యప్రదేశ్లోని విదిషా నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ సుమారు రూ. 8 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లను దొంగలు రాత్రికి రాత్రే ఎత్తుకెళ్లారు. మెయిన్ రోడ్, దుర్గా నగర్ కూడలి, జిల్లా కోర్టు, వివేకానంద చౌక్ వంటి రద్దీ ప్రాంతాల నుంచి స్పీడ్ బ్రేకర్లు రాత్రికి రాత్రే అదృశ్యమయ్యాయి. నిత్యం రద్దీ, పోలీసు గస్తీ, భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ, దొంగలు ఎవరికీ తెలియకుండా వీటిని తీసుకెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటుగానే స్పీడ్ బ్రేకర్లు దొంగలించి ఏం చేసుకుంటారనే ప్రశ్న కూడా ఉత్పన్నమైంది. మెయిన్ రోడ్ పై స్పీడ్ బ్రేకర్లనే దొంగిలించగలిగితే, సామాన్య పౌరులకు ఇంకేం భద్రత ఉంటుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పోలీస్ నిఘా వ్యవస్థలు, రాత్రి వేళల్లో గస్తీ, మున్సిపల్ అధికారుల పర్యవేక్షణపై ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన అధికారి దుర్గేష్ ఠాకూర్ ఈ దొంగతనాన్ని ధృవీకరించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, స్పీడ్ బ్రేకర్లను ఎలా తొలగించి, అక్కడి నుంచి ఎక్కడికి రవాణా చేశారో తెలుసుకోవడానికి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
0 Comments