తమిళనాడు లోని శివగంగ జిల్లా నెర్కుప్పై సమీపంలోని ఆత్తికాడు ప్రాంతానికి చెందిన నెడుంజెళియన్ (45), సింగంపుణరిలో 'పుత్తూరు కట్టు పాండి' అనే పేరుతో ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. ఎముకల విరుపు, పక్షవాతం, నరాల బలహీనత వంటి వ్యాధులకు చికిత్స చేస్తానని యూట్యూబ్ మరియు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకున్నాడు. దీనివల్ల తమిళనాడు నలుమూలల నుండి ప్రతిరోజూ 200 నుండి 500 మంది వరకు రోగులు తెల్లవారుజాము నుండే క్యూ కట్టేవారు. అతను తప్పుడు వైద్యం చేస్తున్నాడని జిల్లా కలెక్టర్ కె. పొర్కోడికి ఫిర్యాదు అందడంతో, ఆమె ఆదేశాల మేరకు దేవకోట్టై సబ్ కలెక్టర్ ఆయుష్ వెంకట్ వట్స్ నేతృత్వంలో ఆరోగ్య శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. నెడుంజెళియన్ కేవలం ప్లస్ టూ (ఇంటర్) వరకు మాత్రమే చదువుకున్నాడు. దిండిగల్లోని ఒక అనధికార సంస్థలో పారామెడికల్ అసిస్టెంట్ నర్సింగ్ కోర్సు చేశాడు. అంతేకాకుండా, దిండిగల్కు చెందిన ఒక ప్రముఖ డాక్టర్ సర్టిఫికెట్ను ఫోర్జరీ చేసి ఆసుపత్రి నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనితో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఆసుపత్రిని సీజ్ చేసిన అధికారులు, అక్కడ ఉన్న అనేక రకాల తైలాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఆరోగ్య శాఖ అధికారి అరుణ్ దాసన్ మాట్లాడుతూ నెడుంజెళియన్ గతంలో తిరుచ్చి జిల్లా తువరంకురిచ్చిలో ఆసుపత్రి నిర్వహించి అక్కడ గొడవలు జరగడంతో ఇక్కడికి వచ్చాడని తెలిపారు. అతను చికిత్స కోసం నువ్వుల నూనె, వేప నూనె వంటి వాటిలో కొన్ని చెట్టు బెరడులను కలిపి తైలాలుగా వాడుతున్నట్లు గుర్తించారు.
0 Comments