ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో వివాహేతర సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడనే కారణంతో భార్యే అతడిని తమ్ముడితో హత్య చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. దోర్నాలకు చెందిన అడపాల లాలు శ్రీను (38)కు సున్నిపెంటకు చెందిన ఝాన్సితో 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. శ్రీను వృత్తిరీత్యా లారీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే కొంతకాలంగా శ్రీను చెడు వ్యసనాలకు అలవాటు పడినట్లు పోలీసులు తెలిపారు. రెండు నెలల క్రితం గంజాయి అక్రమ రవాణా కేసులో అతడు అరెస్టై ఒంగోలు జైలులో రిమాండ్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో దంపతుల మధ్య విభేదాలు మరింత పెరిగినట్లు విచారణలో వెల్లడైంది. అయితే భర్తతో గొడవలు పెరగడంతో ఝాన్సీ తన తమ్ముడి స్నేహితుడైన సూర్యనారాయణతో వివాహేతర సంబంధం కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలిసిన శ్రీను తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. జైలులో రిమాండ్లో ఉన్న సమయంలో ఝాన్సీ అతడిని కలవడానికి వెళ్లినప్పుడు, ఆమెతో పాటు సూర్యనారాయణను చంపేస్తానని బెదిరించినట్లు డీఎస్పీ తెలిపారు. శ్రీను జైలు నుంచి విడుదలైతే తమ ప్రాణాలకు ముప్పు ఉంటుందని భావించిన ఝాన్సీ, సూర్యనారాయణతో కలిసి హత్యకు పథకం వేశారు. ఈ హత్యను అమలు చేయడానికి గుంటూరుకు చెందిన ఒక గ్యాంగ్కు రూ.2 లక్షలు సుపారీ ఇచ్చినట్లు విచారణలో తేలింది. ఒంగోలు జైలు నుంచి బెయిల్పై విడుదలైన శ్రీనును చిమకుర్తి - పొదిలి మధ్యలో హత్య చేయాలని తొలుత ప్లాన్ చేసినప్పటికీ, అది విఫలమైంది. చివరకు పెద్దారవీడు మండలం అంకారమ్మ గుడి సమీపంలో మరోసారి పథకం అమలు చేశారు. ఆ ప్రాంతంలో కారు ఆపిన అనంతరం ముందే బైక్పై వచ్చిన సూర్యనారాయణ, అతని స్నేహితుడు శ్రీనుపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో భార్య ఝాన్సీ, ఆమె తమ్ముడు కూడా పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడించారు. తీవ్ర గాయాల పాలైన శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య అనంతరం తప్పించుకోవడం సాధ్యం కాదని భావించిన ఝాన్సీ, ఆమె తమ్ముడు పోలీసుల ఎదుట స్వయంగా లొంగిపోయినట్లు డీఎస్పీ తెలిపారు. ప్రస్తుతం వారిద్దరినీ కస్టడీలో విచారిస్తున్నామని చెప్పారు. ఈ కేసులో పాల్గొన్న మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. త్వరలోనే వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ నాగరాజు చెప్పారు.
0 Comments