తొలి వందేభారత్ స్లీపర్ కోలకతా నుంచి గువహటికి పరుగులు పెట్టనున్నది. ఈ రైలు రాకతో తూర్పు భారతం, ఈశాన్య రాష్ట్రాల మధ్య రవాణా సదుపాయం మరింత మెరుగవుతుంది. ఈ రైలు ప్రారంభం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లను దాదాపు పూర్తి చేసింది. సామాన్యుల కోసమే ఈ రైలును ప్రవేశపెట్టినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ రైల్లో ఎమర్జెన్సీ, వీఐపీ కోటాలు వంటివేవీ ఉండవు. అంతేకాకుండా, రైల్వే ఉన్నతాధికారుల పాస్లు కూడా ఈ రైల్లో చెల్లుబాటు కావు. కేవలం కన్ఫర్మ్డ్ టిక్కెట్లు ఉన్న వారికే ఇందులో ప్రయాణించే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆర్ఏసీ టిక్కెట్స్కు కూడా ఈ రైల్లో అనుమతి ఉండదు. ప్యాసింజర్లకు అత్యద్భుత ప్రయాణ అనుభవం కల్పించేందుకు ఇలాంటి నిబంధనలు విధించినట్టు తెలుస్తోంది. ఈ రైల్లో ప్రయాణికులకు ఆధునిక బెడ్స్, బ్లాంకెట్ అందుబాటులో ఉంటాయి. సాధారణ రైళ్లల్లో కంటే ఇవి ఎంతో మెరుగ్గా ఉండనున్నాయి. ఏకీకృత నిబంధనలు, పారదర్శక టిక్కెటింగ్ విధానం అమల్లో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. స్థానిక వంటకాలు ఈ రైల్లో అందుబాటులో ఉంటాయి. భారత సంస్కృతి ఉట్టిపడేలా రైలు లోపలి డిజైన్ ఉంటుందని కూడా అధికారులు చెప్పారు. ఈ రైల్లో మొత్తం 823 బెర్తులు ఉన్నాయి. పదకొండు 3-టైర్ ఏసీ కోచ్లు, నాలుగు 2-టైర్ ఏసీ కోచ్లు, 1-ఏసీ కోచ్ ఒకటి ఉన్నాయి. ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా బెర్తులను రూపొందించారు. భద్రతా చర్యలకు కూడా పెద్ద పీట వేశారు. రైలు ప్రమాదాలను నివారించే కవచ్ వ్యవస్థతో పాటు పరిశుభ్రత కోసం కోచ్లల్లో ప్రత్యేక డిస్ఇన్ఫెక్టెంట్ టెక్నాలజీని ఉపయోగించారని అధికార వర్గాలు తెలిపాయి.
0 Comments