Ad Code

ప్రొఫెసర్, తోటి విద్యార్థుల వేధింపులు తాళలేక ప్రాణాలు కోల్పోయిన విద్యార్థిని : సెల్ఫీ వీడియో వైరల్


హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ప్రొఫెసర్, తోటి విద్యార్థుల వేధింపులు భరించలేక ప్రాణాలు కోల్పోయింది. చనిపోయే ముందు ఆమె తన ఆవేదనను సెల్ఫీ వీడియోలో రికార్డు చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ విద్యార్థిని తన చివరి వీడియోలో కాలేజీ ప్రొఫెసర్ అశోక్ కుమార్ తన పట్ల ఎంత అసభ్యంగా ప్రవర్తించేవాడో వివరించింది. క్లాస్ రూమ్‌లోనూ, క్యాంపస్‌లోనూ ప్రొఫెసర్ తనను అనుచితంగా తాకేవాడని, మానసిక వేధింపులకు గురిచేసేవాడని ఆరోపించింది. ఈ విషయాన్ని బయట చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తనను బెదిరించినట్లు ఆమె ఆ వీడియోలో పేర్కొంది. బాధితురాలి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం సెప్టెంబర్ 18న హర్షిత, ఆకృతి, కోమలిక అనే ముగ్గురు విద్యార్థినులు తన కూతురిని దారుణంగా ర్యాగింగ్ చేసి కొట్టారు. దీనికి తోడు ప్రొఫెసర్ వేధింపులు కూడా తోడవడంతో ఆమె తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం క్షీణించింది. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన అనంతరం, డిసెంబర్ 26న లూథియానాలోని ఒక ఆస్పత్రిలో ఆమె తుది శ్వాస విడిచిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ర్యాగింగ్ కోణంలోనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. వీడియో బయటకు రావడంతో ప్రొఫెసర్ అశోక్ కుమార్‌పై కూడా కేసు నమోదు చేశారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత, హిమాచల్ ప్రదేశ్ విద్యా సంస్థల (ర్యాగింగ్ నిషేధ) చట్టం కింద కేసులు నమోదయ్యాయి. 

Post a Comment

0 Comments

Close Menu