టీ20 వరల్డ్కప్ మ్యాచ్ల కవరేజీ కోసం దరఖాస్తు చేసుకున్న బంగ్లాదేశ్కు చెందిన క్రీడా జర్నలిస్టులకు అనుమతి నిరాకరించింది. దాదాపు వందకుపైగా అప్లికేషన్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి తిరస్కరించింది దాంతో తమ బోర్డు చేసిన తప్పిదానికి మమల్ని శిక్షించవద్దని వారు వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మీడియా అక్రిడిటేషన్స్ జారీని మరోసారి పరిశీలిస్తామని ఐసీసీ వెల్లడించింది. భారత్లో వరల్డ్కప్ కోసం తమ జట్టును పంపబోమని బెట్టుచేసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు వరుసగా షాక్లు తగులుతున్నాయి. భద్రతా కారణాలను సాకుగా చూపి మేము ఆడమంటే ఆడమని పంతం పట్టినందుకు బంగ్లాదేశ్ను తప్పించిన స్కాంట్లాండ్కు అవకాశమిచ్చింది ఐసీసీ. ఇప్పుడు వరల్డ్కప్ కవరేజీ కోసం దరఖాస్తు చేసుకున్న క్రీడా జర్నలిస్ట్లకు అనుమితివ్వలేదు ఐసీసీ. ఈ విషయంపై బంగ్లా బోర్డు మీడియా అధ్యక్షుడు హంజద్ హొసేన్ తిరస్కరణకు కారణాలు తెలపాలని ఐసీసీని కోరాడు. 'మా దేశ క్రీడా జర్నలిస్ట్ల దరఖాస్తులను తిరస్కరించారనే విషయం సోమవారం తెలిసింది. అందుకు కారణం తెలపాలని ఐసీసీని కోరాం. ఇది అంతర్గత వ్యవహారం. అయితే ఐసీసీ ఎందుకు మావాళ్లకు అనుమతి ఇవ్వలేదో తెలుసుకోవాలనుకుంటున్నాం' అని ఆయన పేర్కొన్నాడు. ఇక వరల్డ్కప్ కవరేజీ కూడా అసాధ్యమేనా? అనుకుంటున్న బంగ్లాదేశ్ జర్నలిస్ట్లకు ఊరటనిస్తూ అక్రిడిటేషన్ జారీ ప్రక్రియపై మరోసారి దృష్టి సారిస్తున్నామని ఐసీసీ తెలిపింది. 'దేశం ప్రాతిపదికన చూసినా ఒక్కో దేశానికి చెందిన జర్నలిస్ట్లకు అక్రిడిటేషన్స్ 40కి మించవు. వరల్డ్కప్ ఆతిథ్య బోర్డుల సూచనల ప్రకారం అక్రిడిటేషన్ దరఖాస్తులకు అనుమతినిస్తుంది. ఈసారి మెగా టోర్నీని కవర్ చేసేందుకు భారీగా జర్నలిస్ట్లు దరఖాస్తు చేసుకున్నారు. దాంతో.. అక్రిడిటేషన్ పాసుల జారీ ప్రక్రియను మరోసారి పరిశీలిస్తున్నాం. అర్హత, నిబంధనలను బట్టి అక్రిడిటేషన్ జాబితాను సిద్ధం చేస్తాం' అని మంగళవారం ఐసీసీ వర్గాలు తెలిపాయి.
0 Comments