2024 జూలై నుంచి తీవ్ర అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొంటూ 60 శాతం మేర నష్టపోయిన రైల్వే షేర్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. ఇన్ని రోజులు నష్టాలు చవిచూసిన పెట్టుబడిదారులు కేవలం గడిచిన 5 రోజుల్లోనే ఊహించని లాభాలు అందుకున్నారు. అంతా అయిపోయింది అనకున్న తరుణంలో 2025 ఏడాది ముగింపు ఇన్వెస్టర్లను ఆశ్యర్యానికి గురి చేసి వారి జీవితాల్లో సంతోషాన్ని నింపింది. భారతీయ రైల్వే టికెట్ రేట్లను సవరించింది. అవి అమలులోకి కూడా వచ్చాయి. ఈక్రమంలోనే రైల్వే స్టాక్స్ రాణిస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. రైల్వే ఛార్జీలు పెంచడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్. గతంలో ఛార్జ్ లు సవరించినప్పుడు చలించని స్టాక్స్ ఈ సారి మాత్రం గణనీయంగా దూసుకుపోయాయి. ఈ షేర్ల దూకుడు 2025-26 ఆర్థిక సంవత్సరంలో రైల్వేకు రూ.600 కోట్లు అదనపు ఆదాయాన్ని సమకూర్చనుంది. ఈ పెంపు సెక్టార్ వృద్ధికి దోహదం చేస్తుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఈ ఐదు రోజుల్లో రైల్వే రంగానికి చెందిన కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా అరవై ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెరగడం ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వేవ్ లో జుపిటర్ వ్యాగన్స్ షేర్లు కేవలం ఐదు రోజుల్లోనే ముప్పై ఏడు శాతం పెరిగి అందరి దృష్టిని ఆకర్షించాయి. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ 27%, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 20% వృద్ధిని సాధించాయి. వీటితో పాటు ఇర్కాన్, రైల్టెల్, టిటాగఢ్ రైల్ సిస్టమ్స్ వంటి కంపెనీలు కూడా భారీ లాభాలను అందుకున్నాయి. ఈ ఆకస్మిక లాభాల వెనుక కొన్ని బలమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. 2026-27 కేంద్ర బడ్జెట్లో రైల్వే రంగానికి రికార్డు స్థాయిలో ఒక లక్షా ముప్పై వేల కోట్ల రూపాయల కేటాయింపులు ఉండవచ్చనే అంచనాలు మార్కెట్లో బలంగా వినిపిస్తున్నాయి. వందే భారత్ రైళ్లకు పెరుగుతున్న ఆదరణ, త్వరలో పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్ రైళ్లు.. అలాగే రైల్వే భద్రత కోసం ప్రవేశపెట్టిన 'కవచ్' వ్యవస్థ వంటి భారీ ప్రాజెక్టులు ఈ కంపెనీల భవిష్యత్తుపై భరోసానిచ్చాయి. అయితే ఈ సంబరాల మధ్య స్టాక్ మార్కెట్ నిపుణులు ఇన్వెస్టర్లకు ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు లాభాలు వస్తున్నాయని పెట్టుబడి పెడితే మీ డబ్బులు ఆవిరయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే అని, ఇవి ఇంకా వాటి పాత గరిష్ట స్థాయిలకు చేరుకోలేదని గుర్తు చేస్తున్నారు. తొందరపడి పెట్టుబడులు పెట్టకూడదని సూచిస్తున్నారు
0 Comments