భారతదేశ విదేశీ మారక నిల్వలు డిసెంబర్ 19తో ముగిసిన వారంలో భారీగా పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఈ వారంలో ఫారెక్స్ నిల్వలు 4.37 బిలియన్ డాలర్లు పెరిగి మొత్తం 693 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు బంగారం నిల్వలు, విదేశీ కరెన్సీ ఆస్తులు పెరగడమేనని చెప్పవచ్చు. డిసెంబర్ 16న ఆర్బీఐ నిర్వహించిన 5 బిలియన్ డాలర్ల బై-సెల్ స్వాప్ వేలం ఈ పెరుగుదలలో కీలక పాత్ర పోషించింది. ఈ స్వాప్ లావాదేవీ డిసెంబర్ 18న ముగిసింది. ఈ స్వాప్ ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలో డాలర్ లిక్విడిటీ పెరగడంతో పాటు, ఫారెక్స్ నిల్వలకు కూడా బలం చేకూరింది. ఆర్బీఐ డేటా ప్రకారం నివేదించబడిన వారంలో బంగారం నిల్వలు 2.6 బిలియన్ డాలర్లు పెరిగాయి. అలాగే విదేశీ కరెన్సీ ఆస్తులు 1.6 బిలియన్ డాలర్లు పెరిగి 559 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇందులో గమనించదగ్గ విషయం ఏమిటంటే.. భారతదేశ ఫారెక్స్ నిల్వలు గతంలో సెప్టెంబర్ 2024లో 705 బిలియన్ డాలర్లతో చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. ఈ పరిణామాలపై ప్రభుత్వ యాజమాన్య బ్యాంక్కు చెందిన ఓ ఫారెక్స్ డీలర్ మాట్లాడుతూ..ఆ వారంలో ఆర్బీఐ భారీగా డాలర్లను విక్రయించినప్పటికీ, స్వాప్ వేలం ద్వారా 5 బిలియన్ డాలర్లు రావడంతో నికరంగా ఫారెక్స్ నిల్వలు సానుకూలంగా నిలిచాయని తెలిపారు. ఫిన్రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్ ఎల్ఎల్పి ట్రెజరీ హెడ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ భన్సాలీ మాట్లాడుతూ, డిసెంబర్ 19 నాటికి ఫారెక్స్ నిల్వలు 4.368 బిలియన్ డాలర్లు పెరిగాయని పేర్కొన్నారు. అదే సమయంలో ఆర్బీఐ భారీగా డాలర్ అమ్మకాలు జరపడం వల్ల డాలర్ విలువ 91.08 నుంచి 89.27కి పడిపోయిందని తెలిపారు. ఆ వారంలో ఆస్తులు 1.641 బిలియన్ డాలర్లు పెరగడం, బంగారం నిల్వలు 2.623 బిలియన్ డాలర్లు పెరగడం చూస్తే.. ఆర్బీఐ 89 స్థాయిలో భారీగా కొనుగోళ్లు కూడా చేసి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ వారం రూపాయి తీవ్ర అస్థిరతను ఎదుర్కొంది. వరుసగా నాలుగు సెషన్లలో కొత్త కనిష్ట స్థాయిలను తాకిన రూపాయి, చివరికి డాలర్తో పోలిస్తే 1.3 శాతం బలంగా స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం రేటు 91.08 నుంచి 89.25 మధ్య ఊగిసలాడింది. మార్కెట్లో ఊహాజనిత పొజిషన్లు అధికంగా ఉన్నాయని గుర్తించిన ఆర్బీఐ, మరింత దూకుడుగా జోక్యం చేసుకుని స్పాట్ రేటును తగ్గించింది. డిసెంబర్ 19న చివరి ట్రేడింగ్ సెషన్లో రూపాయి బలంగా పుంజుకోవడం వెనుక కూడా ఆర్బీఐ చర్యలే ప్రధాన కారణం. ఆ రోజున సెంట్రల్ బ్యాంక్ సుమారు 3 బిలియన్ డాలర్ల నుంచి 4 బిలియన్ డాలర్ల వరకు డాలర్లను విక్రయించి ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇక డిసెంబర్ నెలలో ఇప్పటివరకు ఆర్బీఐ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్లు, ఫారెక్స్ బై-సెల్ స్వాప్ల ద్వారా రూ. 1.45 ట్రిలియన్ల మన్నికైన లిక్విడిటీని వ్యవస్థకు అందించింది. ఇది బ్యాంకింగ్ రంగానికి గణనీయమైన ఊరటనిచ్చింది. ఈ వారంలో స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 8 మిలియన్ డాలర్లు పెరిగి 18.74 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అలాగే అంతర్జాతీయ ద్రవ్య నిధి వద్ద భారతదేశ రిజర్వ్ స్థానం 95 మిలియన్ డాలర్లు పెరిగి 4.78 బిలియన్ డాలర్లకు చేరుకుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఆర్బీఐ దూకుడైన జోక్యాలు, స్వాప్ వేలాలు, బంగారం-కరెన్సీ ఆస్తుల పెరుగుదల వల్ల భారతదేశ ఫారెక్స్ నిల్వలు బలంగా కొనసాగుతున్నాయని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
0 Comments