మధ్యప్రదేశ్లోని బంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ సమీపంలోని ఒక గ్రామంలోకి అర్ధరాత్రి సమయంలో ఒక పులి ప్రవేశించింది. ఇంటి బయట ఉన్న గోపాల్ కోల్ అనే వ్యక్తిపై ఆకస్మికంగా దాడి చేసి గాయపరిచింది. అయితే, ఆ తర్వాత అడవిలోకి వెళ్లకుండా, అదే ఇంటి ఆవరణలో ఉన్న మంచంపైకి ఎక్కి గంటల తరబడి విశ్రాంతి తీసుకుంది. మంచంపై పులి తిష్ట వేయడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకోవడానికి వారంతా ఇళ్ల పైకప్పుల పైకి ఎక్కి గంటల తరబడి గడిపారు. పులి మంచంపై పడుకుని ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు 8 గంటల పాటు శ్రమించి, పులిని సురక్షితంగా బంధించి తిరిగి అడవిలో విడిచిపెట్టారు. పులి దాడిలో గాయపడిన గోపాల్ కోల్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
0 Comments