దేశీయ మార్కెట్లోకి జనవరి 8న విడుదలకు పోకో ఎం8 5జీ సిద్ధమవుతోంది. గత కొన్ని వారాలుగా పోకో సంస్థ ఈ ఎం8 5జీ మోడల్ను టీజర్ల ద్వారా పరిచయం చేస్తూ ఆసక్తిని పెంచుతోంది. ఈ డివైస్ స్నాప్డ్రాగన్ చిప్సెట్తో శక్తిని పొందనుందని, అలాగే సొగసైన డిజైన్తో వినియోగదారులను ఆకట్టుకోనుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే రెడ్ మీ నోట్ 15, రెడ్ మీ 16 ప్రో సిరీస్లు ప్రకటించిన కొద్ది రోజులకే ఇది లాంచ్ కానుంది. అధికారిక సమాచారం ప్రకారం, లాంచ్ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ కేవలం 7.35 మిల్లీమీటర్ల మందంతో, సుమారు 178 గ్రాముల బరువుతో ఉండనుందని సమాచారం. ఫోటోగ్రఫీ విభాగంలో ఇది 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను పొందనుంది. ఈ కెమెరా ఏఐ ఆధారిత ఫీచర్లతో మెరుగైన ఫోటో అనుభవాన్ని అందించనుందని కంపెనీ సూచిస్తోంది. అదనంగా, స్క్విర్కిల్ ఆకారంలో ఉండే కెమెరా మాడ్యూల్లో మరో రెండు సెన్సార్లు కూడా ఉండే అవకాశం ఉంది.
0 Comments