మైసూరులోని హున్సూర్ బస్టాండ్ సమీపంలో స్కై గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్లోకి సాయుధులైన కొందరు దుండగులు ప్రవేశించి, సిబ్బందిని గన్స్ గురిపెట్టి బెదిరించి సుమారు రూ.4.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో మాస్కులు ధరించిన ఐదుగురు వ్యక్తులు ఆ షాపులోకి ప్రవేశించారు. గన్స్ చూపించి అక్కడున్న సిబ్బందిని బెదిరించారు. ఒక వ్యక్తి గన్ పేల్చి కస్టమర్లు, సిబ్బందిని భయపెట్టాడు. దీంతో వారంతా నేలపై కూర్చొన్నారు. అరల్లో ఉన్న ఉన్న గోల్డ్, డైమండ్ ఆభరణాలను మరో వ్యక్తి కుప్పలుగా పోశాడు. తలకు హెల్మెట్లు ధరించిన ఇద్దరు వ్యక్తులు వెంట తెచ్చిన బ్యాగుల్లో వాటిని నింపారు. ఆ తర్వాత వారంతా అక్కడి నుంచి పారిపోయారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ జ్యుయలరీ షాపు వద్దకు చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. ఆదివారం మధ్యాహ్నం వేళ చాలా మంది సిబ్బంది భోజనం కోసం వెళ్లగా షాపులో కొద్ది మంది ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగిందని పోలీస్ అధికారి తెలిపారు. సిబ్బందిని ప్రశ్నించి వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేసినట్లు చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
0 Comments