తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజునే తొలి ఏకగ్రీవ ఎన్నిక నమోదు అయింది. రుద్రంగి మండలంలోని రూపులా తండాలో సర్పంచ్ పదవికి జవహర్ లాల్ నాయక్ను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో అక్కడ ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ఏకగ్రీవ నిర్ణయానికి గ్రామ పెద్దలు, యువత, మహిళలు కలిసి మద్దతు తెలపడంతో పోటీ అవసరమే లేకుండా పోయింది. జవహర్ లాల్ నాయక్ ఏకగ్రీవంగా ఎంపికైన వెంటనే తండా అంతటా టపాసులు కాల్చి వేడుకలు జరుపుకున్నారు. గ్రామస్థులంతా కలిసి సంబరాలు చేసుకుంటూ ఆయనకు అభినందనలు తెలిపారు. తన విజయంపై స్పందించిన సర్పంచ్ జవహర్ లాల్ నాయక్.. గ్రామ ప్రజలు చూపిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతూ, పంచాయతీ పరిధిలో అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తండా అభివృద్ధి, ప్రాథమిక సౌకర్యాల మెరుగుదల, ప్రజల కోరికలను నెరవేర్చడం తన ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.
0 Comments