అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం వైట్ హౌస్లో న్యూయార్క్ నగర మేయర్గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీని కలుస్తానని ప్రకటించారు. ఈ నెల ప్రారంభంలో మేయర్ ఎన్నికల్లో గెలిచిన డెమోక్రటిక్ సోషలిస్ట్తో రిపబ్లికన్ నాయకుడు చేసే మొదటి సమావేశం ఇదే కావడం విశేషం. అమెరికా అధ్యక్షుడు న్యూయార్క్ నగర ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి, న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోకు మద్దతు ఇవ్వడంతో మమ్దానీ-ట్రంప్ ఒకరినొకరు విమర్శించుకున్నారు. అమెరికా దేశంలో అతిపెద్ద నగరంలో డెమొక్రాట్లు ఒక కమ్యూనిస్ట్ను ఎన్నుకున్నారని ట్రంప్ ఆరోపించారు. అయితే వీరిద్దరి కలయిక పై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఓవల్ కార్యాలయంలో ట్రంప్ ఈ సమావేశం జరుగుతుందని తాజాగా ప్రకటించారు. ఎన్నికల తర్వాత ప్రజా సమస్యలపై మమ్దానీతో కలిసి డొనాల్డ్ ట్రంప్ పని చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం గురించి తెలియజేస్తూ ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. “న్యూయార్క్ నగర కమ్యూనిస్ట్ మేయర్ జోహ్రాన్ క్వామే మమ్దానీ సమావేశం కావాలని కోరారు. ఈ సమావేశం నవంబర్ 21వ తేదీ శుక్రవారం ఓవల్ కార్యాలయంలో జరుగేందుకు అంగీకరించాము. వివరాలు తరువాత వెల్లడిస్తాము” అని ట్రంప్ పేర్కొన్నారు. ఇంతకుముందు మమ్దానీని కలవాలని ప్లాన్ చేశారని, “మేము ఏదైనా పని చేస్తాము” అని అన్నారు. ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలను, వలసల నియంత్రణను, గాజా యుద్ధంలో ఇజ్రాయెల్కు అమెరికా మద్దతును కూడా మమ్దానీ విమర్శించారు. అధ్యక్షుడితో సమావేశం కోసం తన బృందం వైట్ హౌస్ను సంప్రదించిందని మమ్దానీ గతంలో తెలిపారు. “ఎన్నికల ప్రచారంలో న్యూయార్క్ వాసులకు ఇచ్చిన నిబద్ధతను నెరవేర్చడానికి నా బృందం వైట్ హౌస్ను సంప్రదించింది” అని న్యూయార్క్ నగర మేయర్గా ఎన్నికైన తర్వాత ఆయన వ్యాఖ్యానించారు.
0 Comments