ఢిల్లీ కాలుష్యంపై అత్యవసరంగా కేసు విచారణ జరపాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరడంతో జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ-ఎన్సీఆర్లో అత్యంత ప్రమాదకరమై పరిస్థితులు ఉన్నాయని, వెంటనే శుద్ధమైన గాలి వచ్చేలా మేము ఏమి ఆదేశించగలం? అని వ్యాఖ్యానించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కోర్టులు ఎటువంటి అద్భుతాలు చేయలేవన్నారు. ''ఢిల్లీ కాలుష్య సమస్య ఏంటి అన్నది అందరికీ తెలుసు. అన్ని కారణాలను గుర్తించాలి. ఒక్క కారణంతో ఈ పరిస్థితి ఏర్పడలేదు. పొగమంచుకు కారణమవుతున్న అంశాలను సమగ్రంగా అంచనా వేయగలిగేది సైంటిస్టులు. ప్రభుత్వం ఏఏ కమిటీలను ఏర్పాటు చేసిందో ప్రతి ప్రాంతంలో ఏ పరిష్కారాలు సాధ్యమో స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ కాలుష్యం నివారణ కోసం దీర్ఘకాలిక పరిష్కారం అవసరం. ఈ కేసు ప్రతి సంవత్సరం దీపావళి సమయంలో తెరపైకి వస్తుంది. రిత్యువల్ విధానంలో లిస్ట్ అవుతోంది. చలికాలం ముగిసిన తర్వాత మళ్లీ మాయమవుతుంది. ఢిల్లీలోని వాయు కాలుష్యం నేపథ్యంలో బయటికి వెళ్లడం, వాకింగ్ చేయడం మానేశాను.'' అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. వచ్చే సోమవారం మరోసారి విచారణ జరుపుతామని తెలిపారు.
0 Comments