Ad Code

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం


లక్కా జలసంధి ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ ఈరోజు తుఫానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక మరియు హిందూ మహాసముద్రం మీదుగా అల్పపీడనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.ఇది రాబోయే 12 గంటల్లో ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ తీవ్రఅల్పపీడనంగా మారే అవకాశం ఉందంది. ఆ తదుపరి 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వివరించింది. గురువారం నుంచి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని సూచించింది. వీటి ప్రభావంతో శనివారం నుంచి మంగళవారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రైతులు అప్రమత్తమై వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. బంగాళాఖాతంలో అనూహ్య వాతావరణం ఏర్పడింది. ఒకదాని వెనుక మరోకటి వాయుగుండాలు ఏర్పడ్డాయి. ఒక వాయుగుండం కొనసాగుతుండగా దాని వెనుక మరో అల్పపీడనం బలపడుతుండటంతో రాష్ట్రానికి భారీ వర్ష సూచన జారీ అయింది. మలక్కా జలసంధి వద్ద ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మంగళవారం ఉదయానికి వాయుగుండంగా బలపడింది. ఇది పశ్చిమ దిశగా ఆ తర్వాత వాయవ్య దిశగా కదులుతూ బుధవారం మరింత బలపడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. ఇది తుఫానుగా మారేందుకు కూడా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ వాయుగుండం శనివారం లేదా ఆదివారం నాటికి తమిళనాడు-ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు రావచ్చని కొన్ని వాతావరణ నమూనాలు సూచిస్తుండగా, మరికొన్ని సముద్రంలోనే బలహీనపడొచ్చని అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఏర్పడిన మరో అల్పపీడనం కూడా కొనసాగుతుంది. బుధవారానికి తీవ్ర అల్పపీడనంగా, ఆపై వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది ఉత్తర తమిళనాడు వైపు పయనిస్తుందని...దీని ప్రభావం కూడా ఏపీ, తమిళనాడులపై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు వాయుగుండాల ప్రభావంతో రాష్ట్రంలో శనివారం నుంచి వర్షాలు ప్రారంభమవుతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో శనివారం ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఆదివారం శ్రీసత్యసాయి, నంద్యాల, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. బంగాళాఖాతంలో రెండు వాయుగుండాల నేపథ్యంలో సముద్రం అలజడిగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.ఇప్పటి వరకు వేటకు వెళ్లిన మత్స్యకారులు సైతం వెనక్కి తిరిగి రావాలని వాతావరణ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.

Post a Comment

0 Comments

Close Menu