Ad Code

రోహిణి ఆచార్య రాజకీయాలకు గుడ్‌ బై !


బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె రోహిణి ఆచార్య శనివారం రాజకీయాలకు గుడ్‌ బై ప్రకటించారు. అంతేకాకుండా కుటుంబంతోనూ సంబంధాలు తెంచుకుంటున్నట్లు బహిరంగ ప్రకటన చేశారామె. ''రాజకీయాలను వదిలేయడంతో పాటు కుటుంబంతో సంబంధాలు కూడా తెంచుకుంటున్నాను. సంజయ్ యాదవ్, రమీజ్ కోరుకుంది ఇదే. పూర్తి బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నా'' అని ఎక్స్‌ ఖాతాలో ఆమె పోస్ట్‌ చేశారు. సంజయ్‌ యాదవ్‌ తేజస్వి యాదవ్‌ సలహాదారు కాగా, రమీజ్‌ ఎవరనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. లాలూ కుమార్తె అయిన రోహిణి ఆచార్య భర్త, పిల్లలతో సింగపూర్‌లో స్థిరపడ్డారు. 2022లో తండ్రి లాలూకి తన కిడ్నీ దానం చేయడం ద్వారా అప్పట్లో వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. ఆ సమయంలో అదంతా డ్రామా అంటూ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత ఆమె రాజకీయంగానూ క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సింగపూర్‌ నుంచి వచ్చి మరీ ఆమె సోదరుడు తేజస్వీ యాదవ్‌తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. లాలూ కొడుకులు తేజ్ ప్రతాప్ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌ల మధ్య చాలాకాలంగా విబేధాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో తన వ్యక్తిగత జీవితాన్ని తేజ్‌ ప్రతాప్‌ నెట్టింట పెట్టడంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడంటూ ఎన్నికల ముందు ఆర్జేడీ బహిష్కరించింది. దీంతో జనశక్తి జనతా దళ్ అనే కొత్త పార్టీ ప్రారంభించి మహువా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే వీళ్ల విబేధాలే ఆర్జేడీలో అంతర్గత సంక్షోభానికి దారి తీశాయని, ఎన్డీఏ  పార్టీలు ఈ విభేదాలను ప్రచారంలో హైలైట్ చేశాయని వెరసి ఘోర ఓటమి చవిచూడాల్సి వచ్చిందని అక్కడి విశ్లేషకులు భావిస్తున్నారు. వయోభారంతో బాధపడుతున్న లాలూ, ఈ రాజకీయ సంక్షోభాన్ని మౌనంగా చూస్తూ ఉండిపోయారే తప్ప ఏం చేయలేకపోయారనే అభిప్రాయం ఇప్పుడు వ్యక్తం అవుతోంది. 

Post a Comment

0 Comments

Close Menu