తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి ఆఫీసును ధ్వంసం చేశారు. ఫర్నిచర్ కు నిప్పు పెట్టడంతో పాటు ఆవరణలో ఫ్లెక్సీలు చింపేశారు. ప్రభుత్వ స్థలంలో భారత రాష్ట్ర సమితి కార్యాలయం నిర్మించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ఎమ్మెల్యే పోలీసు బందోబస్తుతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించి, గులాబీ రంగులు వేయించినట్లు కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. కార్యాలయ ప్రాంగణంలో భారీగా పొగలు, మంటలు వ్యాపించాయి. ఆఫీస్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెండ్డి, మణుగూరు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు. బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరువురు పార్టీల మధ్య ఉద్రిక్తత చెలరేగకుండా పోలీసు బలగాలు మోహరించాయి.
0 Comments