ఈ నెల 19,20 తేదీల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. తర్వాత పశ్చిమంగా పయనించే క్రమంలో ఇది బలపడి తుఫాన్గా మారుతుందని ఇస్రో వాతావరణ నిపుణులు వెల్లడించారు. అనంతరం ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా దిశగా రానుందని అంచనావేశారు. దక్షిణ కోస్తా జిల్లాలపై దీని ప్రభావం ఉంటుందని విశ్లేషించారు. దీని కంటే ముందుగా మరో నాలుగైదు రోజుల్లో శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఒకటి ఏర్పడి దక్షిణ తమిళనాడు దిశగా వస్తున్నట్టు వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. రానున్న రెండు, మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ లో అక్కడక్కడ వర్షాలు కురిసి, ఆ తర్వాత వాతావరణం పొడిగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. దక్షిణ భారతంపైకి చలిగాలులు వీస్తుండటంతో ఆదివారం కోస్తా, రాయలసీమల్లో చలితీవ్రత పెరిగినట్లు వెల్లడించారు .పాడేరు ఏజెన్సీ ప్రాంతాల తో పాటుగా తెలంగాణ కు ఆనుకుని ఉన్న మధ్యకోస్తా, రాయలసీమలోని కొన్నిచోట్ల రాత్రి ఉష్ణోగ్రత లు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. జి.మాడుగులలో 11.6, వజ్రకరూర్లో 11.8, అనంతపురంలో 15.5, ఆరోగ్యవరంలో 16, నందిగామ, జంగమహే శ్వర పురంలలో 17.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాయవ్య, మధ్య, ఉత్తర భారతంలో కొనసాగుతున్న చలి ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల చలి గాలులు కొనసాగుతాయని ఐఎండీ తెలిపింది. కాగా, తుఫాను అవకాశం పైన వాతావరణ శాఖ తాజా అంచనాలతో అధికార యంత్రాంగం తుఫాను కదలికల పైన అప్రమత్తం అయింది.
0 Comments