ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మెగా వేలంలో టీమిండియా స్పిన్నర్, తెలుగు తేజం శ్రీ చరణిని రూ. 1.30 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శ్రీచరణి కోసం యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.30 కోట్ల రికార్డ్ ధరకు సొంతం చేసుకుంది. గత సీజన్లోనూ శ్రీ చరణి ఢిల్లీ క్యాపిటల్స్కే ఆడింది. రూ. 50 లక్షల భారీ ధరకు ఈ తెలుగు తేజాన్ని ఢిల్లీ కొనుగోలు చేసింది. డబ్ల్యూపీఎల్ 2025 సీజన్లో రెండు మ్యాచ్లు మాత్రమే ఆడిన శ్రీ చరణి 4 వికెట్లతో అద్వితీయమైన ప్రదర్శన కనబర్చింది. ఈ అద్భుత ప్రదర్శనతోనే టీమిండియాకు ఆడే అవకాశం అందుకున్న శ్రీచరణి ఏకంగా మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీకి ఎంపికైంది. మెగా టోర్నీలో 21 ఏళ్ల శ్రీ చరణి అదరగొట్టింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన ఈ ఆంధ్రా అమ్మాయి 9 మ్యాచ్ల్లో 4.96 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టింది. ఈ 9 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ మినహా.. ప్రతీ మ్యాచ్లో వికెట్ తీసింది. ముఖ్యంగా సెమీస్, ఫైనల్లో ఆమె కట్టుదిట్టమైన బౌలింగ్ టీమిండియా విజయానికి బాటలు వేసింది. ఈ టోర్నీలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచింది. ఈ ప్రదర్శనే వేలంలో శ్రీ చరణి కోట్లు పలికేలా చేసింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఇదే తొలి మెగా ఆక్షన్ కాగా.. మల్లికా సాగర్ ఆక్షనీర్గా వ్యవహరిస్తోంది. భారత పేసర్ రేణుకా సింగ్ను గుజరాత్ జెయింట్స్ రూ.60 లక్షలకు కొనుగోలు చేసింది. ఇంగ్లండ్ ప్లేయర్ సోఫీ ఎక్లిస్టోన్ను రూ.85 లక్షలకు యూపీ వారియర్స్ ఆర్టీఎమ్ కార్డ్ ద్వారా రిటైన్ చేసుకుంది. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వొల్వార్ట్ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది.

0 Comments