ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని గుంటూరు, విజయవాడకు అనుసంధానం చేస్తూ కొత్తగా నిర్మించే రైల్వే లైను పనులకు కేంద్ర ప్రభుత్వం కొన్నాళ్ల కిందటే పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు ఈ లైను నిర్మిస్తారు. నంబూరు నుంచి గుంటూరువైపు వెళ్లే రైళ్లు, విజయవాడవైపు వెళ్లే రైళ్లు చీలిపోతాయి. నంబూరు రైల్వే జంక్షన్ గుంటూరుకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న స్టేషన్. గుంటూరు వెళ్లే అవసరం లేకుండా న్యూ గుంటూరు, తెనాలి, గూడూరు మీదుగా చెన్నై, తిరుపతి కూడా వెళ్లవచ్చు. వైకుంఠపురం దగ్గర కృష్ణానది నుంచి నంబూరు వరకు నిర్మించే రైల్వే మార్గానికి సంబంధించి సర్వేను ప్రారంభించారు. దారిలో అడ్డంగా ఉండే విద్యుత్తు లైన్లు తొలగించేందుకు, రైల్వే విద్యుత్తు లైన్లకు సంబంధించి సర్వే జరుగుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో అధికారులు భూమిని సేకరించాల్సి ఉంది. దీనికి నోటిఫికేషన్ జారీచేశారు. స్థానికంగా సమావేశాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. అమరావతిని నిర్మించేందుకు 29 గ్రామాల పరిధిలో భూ సమీకరణ విధానంలో ఎలా అయితే భూములను తీసుకున్నారో తమ భూములను కూడా అలాగే తీసుకోవాలని అక్కడి రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలో భూసేకరణ జరుగుతోంది. దీనికి ముందు ఇబ్రహీంపట్నంతోపాటు పరిసర గ్రామాల్లో భూసేకరణ జరిగింది. రైల్వేలో తమ కుటుంబ సభ్యులకు ఒకరికి ఉద్యోగాలివ్వాలని రైతులు కోరుతున్నారు. అలాగే కొన్ని గ్రామాలకు రోడ్లు మరమ్మతులు నిర్వహించడంతోపాటు కొత్త రహదారులు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని అధికారులు రైతులకు హామీ ఇస్తున్నారు. ఈ కొత్త రైలు మార్గం కోసం ఖమ్మం, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 450 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. ఎర్రుపాలెం వద్ద మొదలయ్యే ఈ రైల్వే మార్గంలో 'పెద్దాపురం, చెన్నారావుపాలెం, గొట్టిముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరుకు కొత్తగా స్టేషన్లు వస్తాయి. అమరావతి, పెద్దాపురం, కొప్పురావూరు స్టేషన్లు పెద్దవిగా నిర్మిస్తారు. కృష్ణా జిల్లా పరిటాల వద్ద గూడ్స్ రైళ్లు నిలిపే సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో కొత్తపేట-వడ్డమాను మధ్య కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల మేర వంతెన నిర్మిస్తారు.
0 Comments