ఖతార్ కు చెందిన అల్ జజీరా వార్తా సంస్థపై పాలస్తీనా అధికారులు నిషేధం విధించారు. తమ భూభాగంలో రెచ్చగొట్టే ప్రసారాలు చేస్తోందనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి వార్తా సంస్థలు వెల్లడించాయి. సాంస్కృతిక, అంతర్గత, సమాచారశాఖలతో కూడిన ప్రత్యేక మంత్రివర్గ కమిటీ అల్ జజీరా ప్రసారాలు నిలిపివేయాలని నిర్ణయించుకుంది. తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే కంటెంట్ ను ప్రసారం చేయడంతో పాటు పాలస్తీనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నట్లు అధికారులు ఆరోపించారు. అక్కడ అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిపారు. ఈ చర్యల వల్ల ఆ వార్తా సంస్థపై నిషేధం విధిస్తున్నట్లు తెలుస్తోంది. వాటిని సరిదిద్దుకునేవరకు జర్నలిస్టులు, ఉద్యోగులు, సిబ్బంది ఎలాంటి విధులు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేశారు. రమల్లాలోని తమ కార్యాలయానికి ప్రసార కార్యక్రమాలు నిలిపివేయాలని ఉత్తర్వులు అందాయని ఆ వార్తా సంస్థ ఉద్యోగి ఒకరు తెలిపారు.
0 Comments