Ad Code

బెంగళూరులో రెండు హెచ్‌ఎమ్‌పీవీ కేసులు : ధృవీకరించిన ఐసీఎమ్ఆర్


దేశంలో రెండు హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (హెచ్‌ఎమ్‌పీవీ) కేసులు బయటపడ్డాయి. రెండు కేసులూ కర్ణాటక రాజధాని బెంగళూరులోనే వెలుగు చూసినట్లు భారత వైద్య పరిశోధన మండలి తాజాగా ధృవీకరించింది. బెంగళూరులోని బాప్టిస్ట్‌ ఆసుపత్రిలో మూడు నెలల, ఎనిమిది నెలల చిన్నారులకు ఈ వైరస్‌ సోకిటనట్లు తేలింది. మూడు నెలల శిశువు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ కాగా, ఎనిమిది నెలల పాప ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది. బాధిత కుటుంబ సభ్యులకు అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన హిస్టరీ లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. హ్యూమన్‌ మెటాన్యూమోవైరస్‌ను(హెచ్‌ఎంపీవీ) మొదట 2001లో గుర్తించారు. 2011-12లో అమెరికా, కెనడా, ఐరోపా ఈ వైరస్‌ కేసులు నమోదయ్యాయి. హెచ్‌ఎంపీవీ వైరస్‌ సోకితే సాధారణంగా దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్‌, నిమోనియా వంటి సమస్యలకు సైతం దారి తీయొచ్చు. సాధారణంగా వైరస్‌ సోకిన మూడు నుంచి ఆరు రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. దగ్గు, తుమ్ముల నుంచి వచ్చే తుప్పిర్లు ద్వారా వైరస్‌ వ్యాపిస్తుంది. వైరస్‌ సోకిన వారికి షేక్‌హ్యాండ్‌ ఇచ్చినా, తాకినా వైరస్‌ సోకవచ్చు. వైరస్‌తో కలుషితమైన వస్తువులను తాకి, అవే చేతులతో ముక్కు, మూతి, కళ్లను తాకినా వైరస్‌ సోకుతుంది. పిల్లలు, వయోధికులు, రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వారికి హెచ్‌ఎంపీవీ ముప్పు అధికం. తరచూ సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు చేతులను శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకోని చేతులతో ముఖాన్ని ముట్టుకోవద్దు. అనారోగ్య లక్షణాలతో ఉన్న వారికి కొంచెం దూరంగా మసులుకోవాలి. తరచూ ముట్టుకునే వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ముక్కు, నోరుకు టిష్యూ లేదా కర్చీఫ్‌ను అడ్డుపెట్టుకోవాలి. తరచూ కనీసం 20 సెకన్ల పాటు సబ్బు, నీటితో శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత వస్తువులు ఇతరులు వినియోగించడానికి ఇవ్వొద్దు. అనారోగ్యంగా ఉంటే ఇంటికే పరిమితం అవడం మంచిది.

Post a Comment

0 Comments

Close Menu