కర్ణాటకలోని మంగళూరులో సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపై జరిగిన చర్చా కార్యక్రమంలో కేంద్ర పునరుత్పాదక విద్యుత్ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొని మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే శిలాజ ఇంధనాలను ఉపయోగించి ఉత్పత్తి చేసే ఉచిత విద్యుత్ పంపిణీ వెనుక ఉద్దేశాలపై తాను వ్యాఖ్యానించబోనన్నారు. అయితే, విద్యుత్ రంగంలో సుస్థిరతే దేశానికి సురక్షిత భవిష్యత్తుకు కీలకం కానుందని అభిప్రాయపడ్డారు. ఇంటి పైకప్పుపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లును తగ్గించుకునేందుకు 'ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన' పథకానికి గతేడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా కోటి మంది ప్రజలకు సౌర విద్యుత్ ఏర్పాటుకు రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే అంశంపై కర్ణాటకలోని మంగళూరులో చర్చావేదికలో మంత్రి మాట్లాడారు. పునరుత్పాదక రహిత ఇంధన వనరులతో కూడిన ఉచిత పథకాలు భారంగా మారుతున్నాయన్నారు. ఈ సందర్భంగా గతంలో తాను బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న సమయాన్ని గుర్తు చేసిన ఆయన.. ఉచితంగా పంపిణీ చేస్తున్న వాటికి చెల్లించాల్సిన ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుందన్నారు. 2.5 లక్షల టన్నుల బొగ్గును తవ్వేందుకు అధిక ఖర్చుతో పాటు పర్యావరణ క్షీణత, థర్మల్ విద్యుత్ ఉత్పత్తిదారులకు రవాణా చేయడం.. ఇలా అనేక వ్యయప్రయాసలు ఉంటాయని పేర్కొన్నారు. అందువల్ల పునరుత్పాదక ఇంధన వనరుల్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. గత పదేళ్లలో భారత్ 95.5 గిగావాట్ల సోలార్ విద్యుత్ను సాధించిందని.. అంతకుముందు ఇది 2.3 గిగావాట్లుగా ఉండేదని తెలిపారు.
0 Comments