మధ్యప్రదేశ్ కి చెందిన రాహుల్ అహిర్వార్ అనే యువకుడు ఢిల్లీలో లేబర్గా పనిచేస్తున్నాడు. ఇటీవలే వివాహం జరిగింది. ఆదివారం రాత్రి ఢిల్లీకి వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలోనే రాత్రి 7 గంటలకు హర్పల్ పూర్ ఏరియాలో రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం రాహుల్ను ఢీ కొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన రాహుల్ అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికుల సమాచారంతో హర్పల్ పూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు ఆ ప్రాంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహోబక్ నాథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో స్థానికులు మహోబక్నాథ్ పోలీసులకు సమాచారం అందించగా, ఆ ఏరియా తమ పరిధిలోకి రాదని, హర్పల్పూర్ పోలీసులకు సమాచారం అందించాలని చెప్పి చేతులు దులుపుకున్నారు. రెండు రాష్ట్రాల పోలీసులు పట్టించుకోకపోవడంతో రాహుల్ మృతదేహం రోడ్డుపైనే పడి ఉంది. గంటలు గడుస్తున్నా పోలీసులు స్పందించకపోవడం, రాహుల్ కుటుంబ సభ్యుల రోదనలతో స్థానికులు మండిపడ్డారు. రాహుల్ కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో చివరకు మహోబక్ నాథ్ పోలీసులు స్పందించి రాత్రి 11 గంటల ప్రాంతంలో రాహుల్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
0 Comments