ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సీబీఐ కోర్టును ఆశ్రయించారు. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉంటూ గతంలో బెయిల్ పొందిన జగన్ కు అప్పట్లో కోర్టు కొన్ని షరతులు పెట్టింది. వీటిని ఉల్లంఘించాలంటే మళ్లీ కోర్టు అనుమతి తీసుకోవాల్సిందే. దీంతో ఓ విషయంలో కోర్టు ఉత్తర్వుల్లో మినహాయింపు కోరుతూ వైఎస్ జగన్ ఇవాళ హైదరాబాద్ సీబీఐ కోర్టును ఆశ్రయించారు. వైఎస్ జగన్ ఈ నెల 11 నుంచి 15 వరకూ విదేశీ పర్యటనకు ప్లాన్ చేసుకున్నారు. భార్య భారతితో కలిసి యూకేకు వెళ్లి లండన్ లో చదువుతున్న కుమార్తెను కలవబోతున్నారు. ఇందుకోసం గతంలో ఇచ్చిన బెయిల్ షరతులను సడలించి తన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై త్వరలో విచారణ జరగాల్సి ఉంది. అయితే సీబీఐ తీసుకునే నిర్ణయం ఇక్కడ మరోసారి కీలకంగా మారనుంది. బెయిల్ షరతుల్ని సడలించి గతంలో పలుమార్లు అధికారంలో ఉండగా జగన్ విదేశీ పర్యటనలకు సీబీఐ కోర్టు అనుమతులు ఇచ్చింది. జగన్ తో పాటు ఇదే కేసులో మరో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డికి కూడా విదేశీ టూర్లకు అనుమతి ఇచ్చింది. అయితే ప్రస్తుతం అధికారంలో లేకపోవడంతో కోర్టు బెయిల్ షరతుల్ని సడలించి జగన్ కు మినహాయింపు ఇస్తుందా లేదా అన్నది సీబీఐ నిర్ణయం మీద ఆధారపడనుంది. అయితే సీబీఐ కూడా జగన్ విదేశీ టూర్ కు అభ్యంతరం చెప్పకపోవచ్చని తెలుస్తోంది.
0 Comments