బంగాళాఖాతం మీదుగా వీస్తోన్న బలమైన ఈస్టర్లీ విండ్స్ లో చోటు చేసుకుంటోన్న మార్పులు చలి గాలికీ కారణమని వాతావరణ శాఖ తెలిపింది. దీనిప్రభావంతో నేటి నుంచి మూడు రోజుల పాటు తమిళనాడు వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెన్నైలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ఈస్టర్లీ విండ్స్ వేగం గంటకు 35 నుండి 45 కిలో మీటర్ల వరకు ఉండొచ్చు. గంటకు 55 కిలో మీటర్ల వరకూ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ తమిళనాడు తీర ప్రాంతాలు, గల్ఫ్ ఆఫ్ మన్నార్, బంగాళాఖాతంలో నైరుతి- దక్షిణ ప్రాంతాల్లో బలమైన తూర్పు ఈదురు గాలులు వీస్తాయి. దీని ప్రభావంతో- చెన్నై సహా తమిళనాడు వ్యాప్తంగా వచ్చే 72 గంటల పాటు అంటే- ఈ నెల 8వ తేదీ వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పుదుచ్చేరి, కరైకల్ల్లోనూ ఇదే తీవ్రత కనిపించే అవకాశాలు లేకపోలేదని అంచనా వేసింది. అదే సమయంలో చలి తీవ్రత భారీగా పెరుగుతుందని ఐఎండీ పేర్కొంది. నీలగిరి, దిండిగల్, కోయంబత్తూరు, సేలం వంటి జిల్లాల్లో వర్షాలతో పాటు పొగమంచు ప్రభావం తీవ్రంగా ఉండొచ్చు. ఊటీ, కొడైకెనల్, కోటగిరి, కూనూరు, ఏర్కాడ్, ఏలగిరి, కుళుక్కుమలై, జవాధు హిల్స్ వంటి ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా అలుముకుంటుందని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది.
0 Comments