ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను ఈనెల 20కి ధర్మాసనం వాయిదా వేసింది. అప్పటి వరకు తొందరపాటు చర్యలు వద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రేషన్ బియ్యం అమ్ముకున్న ఘటనలో ఏ6గా పేర్నినాని ఉండగా, ఏ1గా పేర్నినాని సతీమణి జయసుధ ఉన్నారు. గోడౌన్ మొత్తం కూడా జయసుధ పేరుమీద ఉండటంతో మొదటి నుంచి ఈ కేసులో జయసుధ ఉన్నారు. అయితే ఏ6గా పేర్నినాని చేర్చారు పోలీసులు. ఈ విషయం తెలిసిన వెంటనే పేర్నినాని హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. నిన్న ఈ కేసుపై విచారణ జరుగగా.. నేటికి వాయిదా వేసింది హైకోర్టు. ఈరోజు మరోసారి పేర్నినాని పిటిషన్పై హైకోర్టులో విచారణకు వచ్చింది. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం.. జనవరి 20 వరకు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ కేసులో కీలకంగా ఉన్న ఏ2 మానస్ తేజ్ , ఏ4, ఏ5 లారీ డ్రైవర్, రైసు మిల్లు యజమానిని ఒక రోజు పోలీస్ కస్టడీ ఇస్తూ మచిలీపట్నం జిల్లా కోర్టు ఆదేశించింది. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు వీరు ముగ్గురిని విచారించాలని కోర్టు ఆదేశించింది. దీంతో A2 మానస్ తేజ్, A4 మంగారావు, A5 ఆంజనేయులును పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈరోజు ఉదయం సబ్ జైలు నుంచి నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో బియ్యం మాయం నిందితులను సీఐ ఏసుబాబు బృందం విచారిస్తోంది. వారి నుంచి కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉంది. బియ్యం మాయం ఘటన వెనక ఎవరెవరు ఉన్నారు అని నిందితులను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. పేర్నినాని ఆదేశాలతోనే చేశామని ఇప్పటి వరకు జరిగిన విచారణలో నిందితులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎంతమంది ఉన్నారు.. బియ్యం మొత్తాన్ని ఎక్కడకు తరలించారు అనే అంశాలపై పోలీసులు మరింత ఆరా తీస్తున్నారు. వారిచ్చే సమాచారం మేరకు పేర్నినానిపై అదనపు సెక్షన్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
0 Comments