పంజాబ్ పోలీసులు నూతన సంవత్సర వేడుకల వేళ పౌరులను అప్రమత్తం చేస్తూ విన్నూతంగా సూచనలు జారీ చేశారు. ''వేడుకల సందర్భంగా అధికంగా మద్యం సేవించడం, వీధుల్లో గొడవలు చేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారికి పంజాబ్ పోలీసులు ప్రత్యేక ఆఫర్లు అందజేయనున్నారు. పోలీసు స్టేషన్కు ఉచితంగా ఎంట్రీ ఉంటుంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారికి ప్రత్యేక ట్రీట్మెంట్ ఇస్తాం. అంతేకాకుండా ఈ ఏడాది చివరి రాత్రిని నాశనం చేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే 112కి ఫోన్ చేసి మమ్మల్ని ఆహ్వానించవచ్చు'' అని పేర్కొన్నారు. ఈ పోస్టును పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా చూశారు. పోలీసులు చేసిన ఈ విన్నూత ప్రయత్నానికి ఆయన ఫిదా అయ్యారు. 'ఎక్స్' (ట్విటర్) వేదికగా పంచుకుంటూ పోలీసులపై ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియాను తమదైన శైలిలో వినూత్నంగా వినియోగించుకునే వారిలో పోలీసులు ఒకరని పేర్కొన్నారు. అందరికీ 'హ్యాపీ న్యూ ఇయర్' అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పోస్టు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
0 Comments