తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (73) తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఎక్స్ వేదికగా ఆయన్ను గుర్తుచేసుకుంటూ పోస్ట్ లు పెడుతున్నారు. జాకీర్హుస్సేన్ తో ఉన్న తన ఫొటోను అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ పంచుకున్నారు. జాకీర్ మరణం దేశానికి తీరని లోటు అని పవన్ కల్యాణ్ సతాపం తెలుపుతూ పోస్ట్ పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో తరాలకు జాకీర్ హుస్సేన్ స్ఫూర్తినిచ్చారు. ఆయన మరణం భారతదేశానికి తీరని నష్టం. ఆయన కళ కేవలం సంగీతానికి మాత్రమే సంబంధించినది కాదు.. సంస్కృతులను ఏకం చేసే హృదయ స్పందన. ఆయన వారసత్వం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది' - పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 'జాకీర్ భాయ్.. చాలా త్వరగా వెళ్లిపోయారు. మీ గొప్ప సమయాన్ని, కళను మాకోసం కేటాయించినందుకు కృతజ్ఞతలు. మీరిచ్చిన ప్రతి దానికి ధన్యావాదాలు' అంటూ కమల్ హాసన్ సంతాపం వెలిబుచ్చారు. జాకీర్ హుస్సేన్ ఎందరికో స్ఫూర్తి. తబలాతో ప్రపంచ ఖ్యాతి గడించిన మహోన్నత వ్యక్తి. ఆయన మరణం మనందరికీ తీరని లోటు. ఆయనతో కలిసి ఓ ఆల్బమ్ చేయాలని దశాబ్దకాలం క్రితం అనుకున్నా. అది జరగనందుకు బాధపడుతున్నా. ఆయన్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటా. ఆయన కుటుంబంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు దీన్ని తట్టుకునే శక్తి వారికి ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా' అని ఏఆర్ రెహమాన్ పేర్కొన్నారు.
0 Comments