Ad Code

భారీ లాభాల్లో ముగిసిన సూచీలు !


దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. గురువారం కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు లాభాలకు కారణమయ్యాయి. ఆరంభంలో సూచీలు కాస్త నష్టాల్లోకి ట్రేడయినా తర్వాత బలంగా పుంజుకొన్నాయి. ముఖ్యంగా ఐటీ షేర్లు రాణించాయి. ఇంట్రాడే కనిష్ఠాల నుంచి సెన్సెక్స్‌ దాదాపు 1500 పాయింట్ల మేర లాభాల్లోకి వెళ్లగా, నిఫ్టీ 24,700 ఎగువన ముగిసింది. సెన్సెక్స్‌ ఉదయం 81,182.74 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 80,956.33) లాభాల్లో ప్రారంభమైంది. తర్వాత కాసేపు నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 80,467.37 వద్ద కనిష్ఠాన్ని తాకింది. తర్వాత మళ్లీ పుంజుకొని దాదాపు 1300 పాయింట్లు మేర లాభపడి 82,317.74 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరికి 809.53 పాయింట్ల లాభంతో 81,765.86 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 240.95 పాయింట్లు లాభంతో 24,708.40 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.72గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఇండస్‌ ఇండ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎన్టీపీసీ షేర్లు మినహా అన్ని షేర్లూ లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, టైటాన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 72.51 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2671 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Post a Comment

0 Comments

Close Menu