Ad Code

ఇండియా కూటమికి, మిత్రపక్షాల నేతలకు కృతజ్ఞతలు తెలిపిన మమతా బెనర్జీ !


ఇండియా కూటమికి మిత్రపక్షాల నేతలకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు. తనపై గౌరవం, నమ్మకంతో కూటమికి సారథ్యం వహించే విషయంలో తనకు మద్దతిస్తున్నారని అన్నారు. వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. దేశం అభివృద్ధి చెందాలని..ప్రజలు బాగుండాలని తాను నిరంతరం కృషి చేస్తానని అన్నారు. ఇండియా కూటమిని తానే ఏర్పాటు చేశానని..కాబట్టి దాన్ని సరిగ్గా నడపాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వరుస పరాజయాల నేపథ్యంలో కాంగ్రెస్‌కు రాహుల్‌గాంధీ సారథ్యంపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవకాశం వస్తే ప్రతిపక్ష కూటమికి తాను సమర్థంగా సారథ్యం వహిస్తానని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల చేసిన ప్రకటనతో విపక్షంలో భిన్నస్వరాలు పెరిగాయి. సమాజ్‌వాదీ, శివసేన (ఉద్ధవ్‌) నేతలు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. రాష్ట్రయ జనతాదళ్‌ (ఆర్జేడీ) అధికార ప్రతినిధి మృత్యుంజయ్‌ తివారీ స్పందిస్తూ..''భాజపా వ్యతిరేక పోరాటంలో మమతా బెనర్జీ ఓ మూలస్తంభం. కూటమి నేతలందరం కూర్చొని నాయకత్వం గురించి మాట్లాడుకొంటాం'' అన్నారు. కూటమిలో మమతా బెనర్జీ ప్రధాన భాగస్వామి కావాలని కోరుకొంటున్నట్లు ఉద్ధవ్‌ వర్గం శివసేన నేత సంజయ్‌ రౌత్‌ తెలిపారు. త్వరలోనే మిత్రపక్షాలతో కలిసి కోల్‌కతాకు వెళ్లి దీదీతో భేటీ కానున్నట్లు చెప్పారు. తాజాగా ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఈ విషయంపై స్పందిస్తూ మమత నాయకత్వంలో ప్రతిపక్ష కూటమి ముందుకు వెళ్లాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. మమతకు మద్దతిస్తున్నామని పేర్కొన్నారు. దీంతో తమ అధినేతను కూటమికి నాయకురాలిగా చేయాలని టీఎంసీ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. ఎన్నో ఏళ్లుగా బెంగాల్‌లో భాజపాను ఓడిస్తూ..అధికారం చేపడుతున్న ఏకైక నాయకురాలు మమతా బెనర్జీ అని..ఆమె కూటమి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగలరని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. కాగా కాంగ్రెస్‌ నేతలు వీరి నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. పశ్చిమబెంగాల్‌లో మమత వరుసగా మూడుసార్లు అధికారం చేపట్టినప్పటికీ.. దేశవ్యాప్తంగా టీఎంసీ విస్తరణకు ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదని గుర్తు చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu