అమెరికాకు పొరుగు దేశాలు పొందుతున్న రాయితీలపై కాబోయే నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. కెనడా, మెక్సికో దేశాలకు భారీఎత్తున రాయితీలు ఇవ్వడం కంటే ఆ రెండు అమెరికా రాష్ట్రాలైతే సరిపోతుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ''కెనడాకు ఏటా 100 బిలియన్ డాలర్లకు పైగా రాయితీలు కల్పిస్తున్నాం. ఇక, మెక్సికోకు 300 బిలియన్ డాలర్ల సబ్సిడీ ఇస్తున్నాం. ఎందుకు ఆ దేశాలకు మనం రాయితీలు ఇవ్వాలి? దానికంటే ఆ రెండు దేశాలు అమెరికాలో విలీనమైతేనే మంచిది'' అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అక్రమ వలసదారులను కట్టడి చేయకపోతే కెనడా, మెక్సికో దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తానని కాబోయే అధ్యక్షుడు ఇదివరకే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఫ్లోరిడాకు వచ్చి ట్రంప్తో సమావేశమయ్యారు. ఆ సమయంలో టారిఫ్లు, సబ్సిడీల అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణా కట్టడి చేయడంలో విఫలమైతే కెనడా.. అమెరికా 51వ రాష్ట్రంగా చేరాలని ఆయన ట్రూడోకు చురకలు అంటించినట్లు వార్తలు వచ్చాయి.
0 Comments