దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఒడుదొడుకుల అనంతరం స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నా ఆర్బీఐ ఎంపీసీ భేటీ నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటించారు. ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలో ఎంపీసీ భేటీ నేడు ప్రారంభమైంది. శుక్రవారం నిర్ణయాలు వెలువడనున్నాయి. వడ్డీ రేట్లు తగ్గించకపోయినా సీఆర్ఆర్ను తగ్గించొచ్చన్న అంచనాల నేపథ్యంలో ఇవాళ బ్యాంకింగ్ స్టాక్స్ రాణించాయి. సెన్సెక్స్ ఉదయం 81,036.22 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 80,845.75) లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 80,630.53 - 81,245.39 మధ్య కదలాడింది. చివరికి 110.58 పాయింట్ల లాభంతో 80,956.33 వద్ద ముగిసింది. నిఫ్టీ 10.30 పాయింట్ల లాభంతో 24,467 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.74గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, టీసీఎస్, టైటాన్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, అదానీపోర్ట్స్, పవర్గ్రిడ్ కార్పొరేషన్, మారుతీ సుజుకీ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
0 Comments