Ad Code

వాలెట్‌లోని సొమ్ములతో చెల్లింపులు చేసుకునే వెసులుబాటు !


యూపీఐ చెల్లింపుల విధానంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక మార్పులు చేసింది. ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌లను అందిస్తున్న సంస్థల వాలెట్లలో ఉన్న సొమ్మును ఇకపై థర్డ్‌ పార్టీ మొబైల్‌ అప్లికేషన్లను వినియోగించి చెల్లింపులు (సెండ్‌/ రిసీవ్‌) చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ మేరకు శుక్రవారం ఓ సర్క్యులర్‌ విడుదల చేసింది. పూర్తి కేవైసీ చేసిన పీపీఐ యూజర్‌ ఇకపై థర్డ్‌ పార్టీ యాప్స్‌ ద్వారా పేమెంట్లు చేసుకోవచ్చని పేర్కొంది. సాధారణంగా ప్రీపెయిడ్‌ చెల్లింపు సాధనాల్లో (పీపీఐ) ముందుగానే మనం కొంత డబ్బును జమ చేసి పెట్టుకోవచ్చు. వీటిని వాలెట్లు, లేదా ప్రీ పెయిడ్‌ కార్డులుగా చెప్పొచ్చు. వీటి ద్వారా యూపీఐ, ఆన్‌లైన్‌ లావాదేవీలకు చెల్లింపులు చేయొచ్చు. పీపీఐలో ఉన్న డబ్బు మేరకు బ్యాంకు ఖాతాతో సంబంధం లేకుండా ఖర్చు చేయొచ్చు. ఇప్పటివరకూ పీపీఐ అందిస్తున్న సంస్థకు చెందిన యూపీఐ ద్వారానే ఈ చెల్లింపులు చేసేందుకు వీలవుతుంది. ఇక నుంచి ఈ పీపీఐలకు ఏదైనా యూపీఐ అప్లికేషన్‌ను అనుసంధానం చేసి, చెల్లింపులు చేయొచ్చు. వాలెట్‌, యూపీఐ యాప్‌ వేర్వేరు కంపెనీలకు చెందినవి అయినప్పటికీ, వినియోగదారులు తమ వాలెట్‌లలో దేనినైనా సరే యూపీఐ యాప్‌లతో అనుసంధానం చేయడానికి వీలవుతుంది. అంటే వినియోగదారులు తమ వాలెట్‌లో ఉన్న మొత్తాన్ని ఇతర యూపీఐ అప్లికేషన్‌లలోనూ ఉపయోగించుకోవచ్చన్నమాట. ఇందుకోసం పీపీఐ క్రెడిన్షియల్స్‌ను వినియోగించాల్సి ఉంటుంది. సులువుగా చెప్పాలంటే మీరు ఫోన్‌పే లేదా పేటీఎం వాలెట్‌లో కొంత మొత్తం వేశారనుకుందాం. ఇప్పుటివరకూ ఆ సంస్థ యూపీఐని వాడినప్పుడే ఈ మొత్తాన్ని చెల్లింపుల కోసం వాడుకునే వీలుంటుంది. ఇకపై ఇతర యూపీఐ యాప్‌లు వాడి, ఫోన్‌పే వాలెట్‌లోని డబ్బుతో చెల్లింపులు చేయొచ్చు. దీనివల్ల వినియోగదారులకు డిజిటల్‌ చెల్లింపుల విషయంలో కొత్త వెసులుబాటు లభించనుంది. ముఖ్యంగా గిఫ్ట్‌ కార్డులు, మెట్రో రైలు కార్డులు, డిజిటల్ వాలెట్లను వినియోగించే పీపీఐ యూజర్లకు మరింత వెసులుబాటు లభించనుంది.

Post a Comment

0 Comments

Close Menu