ఈ డిజిటల్ యుగంలో లావాదేవీలకు యూపీఐ ఐడీ, ఫోన్ నంబర్, క్యూ ఆర్ కోడ్ స్కాన్లతో చెల్లింపులు చేసే సదుపాయం ఉండటంతో ఎక్కువ మంది దీని వైపు మక్కువ చూపుతున్నారు. ఒక్కోసారి పొరపాటున రాంగ్ నంబర్కు దీని నుంచి చెల్లింపులు చేసేస్తుంటాం. దీంతో ఆ సొమ్మును ఎలా రాబట్టాలో తెలియక తికమకపడుతుంటాం. ఆ డబ్బు తిరిగి పొందేందుకు కొన్ని మార్గాలున్నాయి. లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలను భద్ర పరుచుకోవడం ముఖ్యం. ట్రాన్సాక్షన్ ఐడీ, యూపీఐ ఐడీ, అమౌంట్, లావాదేవీ జరిపిన తేదీలను జాగ్రత్త పరుచుకోవాలి. అలాగే మీరు యాప్ నుంచి డబ్బు పంపించిన వివరాలను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవడం మంచిది. మీరు ఏ యాప్ ద్వారా చెల్లింపు జరిపారో.. దాని కస్టమర్ కేర్ను సంప్రదించి విషయం తెలియజేయండి. ప్రతి యాప్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థను నిర్వహిస్తుంది. వారికి సాక్ష్యాలు చూపించగానే రిఫండ్ ప్రాసెస్ గురించి మీకు సమాచారం అందిస్తారు. యూపీఐ యాప్ కస్టమర్ సర్వీసు నుంచి సాయం అందకపోతే.. మీరు ఎన్పీసీఐ పోర్టల్లో నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఎన్పీసీఐ అధికారిక వెబ్సైట్కు వెళ్లి ఎడమవైపు కనిపించే యూపీఐ సెక్షన్లో Dispute Redressal Mechanism ఆప్షన్ను ఎంచుకోవాలి. ఆ తర్వాత కనిపించే కంప్లంట్ సెక్షన్లో మీ లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఎంటర్ చేయగానే ఫిర్యాదు స్వీకరిస్తుంది. మీ డబ్బు తిరిగి రప్పించేందుకు వీళ్లు సాయం చేస్తారు. లావాదేవీకి సంబంధించి విషయాన్ని మీ బ్యాంక్లో తెలియజేసి సాయం కోరచ్చు. బ్యాంక్ అడిగే అన్ని వివరాలు, పత్రాలు అందించగానే రిఫండ్ కోసం ఛార్జ్బ్యాక్ ప్రక్రియను మొదలుపెడతారు. సదరు వ్యక్తిని సంప్రదించి డబ్బు వాపసు ఇప్పించేందుకు ప్రయత్నిస్తారు. ఎవరికైతే పొరబాటున పంపామో ఆ వ్యక్తిని సంప్రదించి విషయం తెలియజేయాలి. పేమెంట్ వివరాలు చూపించి డబ్బును తిరిగి ఇవ్వాలని అడగాలి. ఒకవేళ డబ్బు వాపసు పంపేందుకు నిరాకరించినట్లయితే.. చట్టబద్ధంగా ఫిర్యాదు చేయొచ్చు. పైన తెలిపిన మార్గాల ద్వారా మీరు సమస్యను పరిష్కరించుకోలేకపోతే నేరుగా ఆర్బీఐకి కూడా ఫిర్యాదు పంపొచ్చు. ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం పొరపాటున వేరే వ్యక్తులకు డబ్బులు పంపితే ఆ మొత్తం 48గంటల్లోపే తిరిగి పొందొచ్చు. లావాదేవీలు జరిపిన ఇద్దరు వ్యక్తులది వేర్వేరు బ్యాంకులైతే మాత్రం ఈ ప్రక్రియలో కాస్త జాప్యం చోటు చేసుకొంటుంది.
0 Comments